ఉసురుతీసిన క్షణికావేశం

ABN , First Publish Date - 2021-10-17T05:38:59+05:30 IST

క్షణికావేశం నిండు ప్రాణాన్ని బలిగొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యనే నాటు తుపాకీతో హతమార్చాడు ఓ వ్యక్తి. మెళియాపుట్టి మండలం భరణికోటలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఉసురుతీసిన క్షణికావేశం
పద్మ మృతదేహం

- భర్త చేతిలో భార్య హతం

- నాటు తుపాకీతో కాల్చిన వైనం

- భరణికోటలో ఘటన

మెళియాపుట్టి, అక్టోబరు 16: క్షణికావేశం నిండు ప్రాణాన్ని బలిగొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యనే నాటు తుపాకీతో హతమార్చాడు ఓ వ్యక్తి. మెళియాపుట్టి మండలం భరణికోటలో శనివారం రాత్రి చోటుచేసుకున్న  ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  భరణికోటకు చెందిన సవర పద్మ (35) భర్త జోగారావు చేతిలో శనివారం రాత్రి దారుణ హత్యకు గురైంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. కోపోద్రిక్తుడైన జోగారావు జంతువులను వేటాడేందుకు ఉపయోగించిన నాటు తుపాకీతో కాల్చడంతో పద్మ నేలకొరిగింది. కుటుంబసభ్యులు గమనించేసరికి ఆమె మృతిచెందింది. సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. సంఘటనపై ఆరా తీశారు. కొన్నేళ్ల కిందట పద్మతో జోగారావుకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల పాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. గతంలోనూ ఈ గ్రామంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. నాటు తుపాకీతో కాల్చిన ఘటనలో మహిళ మృత్యువాత పడింది. అది మరువక ముందే అటువంటి ఘటనే జరగడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-17T05:38:59+05:30 IST