భార్యను చంపి ప్రేయసితో సుఖంగా ఉందామనుకున్నాడు కానీ..!
ABN , First Publish Date - 2020-02-24T16:52:33+05:30 IST
భార్యను అడ్డు తొలగించుకుని తన ప్రేయసితో సుఖంగా ఉందామనుకున్న ప్రియుడికి...
బెంగళూరు : భార్యను అడ్డు తొలగించుకుని తన ప్రేయసితో సుఖంగా ఉందామనుకున్న ప్రియుడికి చుక్కెదురైంది. పథకం విఫలం కావడంతో తాను చనిపోవడమే కాకుండా, అతడి ప్రియురాలు కూడా ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. చిక్కమగళూరు జిల్లాలో ఆత్మహత్యకు చేసుకున్న దంతవైద్యుడు రేవంత్ (35) తన భార్యను చంపిన అనంతరం భయంతో తాను కూడా రైలుకిందపడి చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అతడి ప్రియురాలు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. చిక్కమగళూరు జిల్లాకు చెందిన డా.రేవంత్కు ఎనిమిదేళ్ళక్రితం ఉడిపి ప్రాంతానికి చెందిన కవితతో వివాహమైంది.
వీరికి ఇరువురు సంతానం. వివాహానికి ముందునుంచే డాక్టర్ రేవంత్కు హర్షిత అనే యువతితో ప్రేమాయణం సాగుతోంది. పెళ్ళి తర్వాత కూడా వారి బంధం కొనసాగింది. ఇది ఇలాఉండగా హర్షిత, బీఎంటీసీ ఉద్యోగి సుధీంద్రను పెళ్ళి చేసుకుని బెంగళూరు రాజరాజేశ్వరీనగర్లో నివసిస్తోంది. ఇలా సాగుతుండగానే రేవంత్, హర్షితాల వివాహేతర సంబంధం అతడి భార్య కవితకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. గొడవ తీవ్రం కావడంతో ఈనెల 17న భార్య కవితకు ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత గొంతుకోసి భర్త రేవంత్ దారుణానికి పాల్పడ్డాడు. ఇది దోపిడీ దొంగల పనేనని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అప్పటినుంచే రేవంత్పై పోలీసులు నిఘా పెట్టారు. విచారణ తీవ్రం చేయడంతో పట్టుబడతానని భావించిన రేవంత్ శనివారం ఏకంగా చిక్కమగళూరు జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన ప్రియురాలు హర్షితా (32)కూడా ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా ఒక హత్య, రెండు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. హర్షితకు ఒక శిశువు ఉంది. ముగ్గురూ మృతి చెందడంతో వారి పిల్లలు కూడా అనాథలయ్యారు. కాగా ఆర్.ఆర్.నగర్లో నివసించే హర్షిత, సుధీంద్ర దంపతుల మధ్య వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.