రైలు పట్టాల జాయింట్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుంది? సిమెంట్ కమ్మీలు ఎందుకు వేస్తారు?.. తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

ABN , First Publish Date - 2021-12-20T12:56:31+05:30 IST

మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు..

రైలు పట్టాల జాయింట్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుంది? సిమెంట్ కమ్మీలు ఎందుకు వేస్తారు?.. తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు రైలు పట్టాల జాయింట్లలో కాస్త గ్యాప్ ఉండడం చూస్తుంటాం. అలాగే ట్రాక్‌ల మధ్య,  సిమెంటు కమ్మీలు, రాళ్లు ఉండటాన్ని కూడా చూస్తుంటాం. అయితే ఇలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? రైలు పట్టాలను జాయింట్ చేసేటప్పుడు వాటి మధ్య కొంత ఖాళీ ఉంచుతారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా రైలు మార్గంలోని ఇనుప పట్టాలు వ్యాకోచిస్తాయి. అటువంటి పరిస్థితిలో పట్టాలను గ్యాప్ లేకుండా జాయింట్ చేస్తే అవి వంకరపోయే అవకాశం ఉంటుంది. అందుకే పట్టాలను జాయింట్ చేసేటప్పుడు వాటి మధ్య కొద్దిగా ఖాళీని వదులుతారు. ఫలితంగా అది వంకరగా మారదు.


ఇదేవిధంగా రైల్వే ట్రాక్‌లు శీతాకాలంలో కుంచించుకుపోతాయి. ఇలా జరగకుండా ఉండేందుకే రైల్వే ట్రాక్‌ల మధ్య సిమెంట్ కమ్మీలను బిగించడంతోపాటు, రాళ్లను వేస్తారు. ఈ సిమెంట్ కమ్మీలను స్లీపర్స్ అని అంటారు. ఇవి రైల్వే ట్రాక్‌ల మధ్య సమాన దూరం ఉండేలా చూస్తాయి. ఈ స్లీపర్‌లతో పాటు, ట్రాక్‌ల మధ్య రాళ్లను వేస్తారు. ఈ రాళ్లు పట్టాల మధ్యలో ఉన్న స్లీపర్‌ను పట్టివుంచి, రైలు బ్యాలెన్సింగ్‌ను కాపాడతాయి. అలాగే ఈ రాళ్ల కారణంగా రైల్వే ట్రాక్‌పై నీరు నిలవదు. మట్టి ఎగరదు. రోడ్డు మీద ఏదైనా భారీ వాహనం వెళుతున్నప్పుడు వెనుక నుంచి దుమ్ము ఎగరడం చూసుంటాం. ఈ విధంగా రైలు ముందుకు వెళ్లాక దుమ్ము ఎగరడం జరగదు.  చిన్నపాటి రాళ్లే దీనికి కారణం.



Updated Date - 2021-12-20T12:56:31+05:30 IST