నాకేం పని లేక మీటింగ్‌ పెట్టానా?

ABN , First Publish Date - 2020-10-24T09:01:54+05:30 IST

‘‘ఇదేం పెళ్లా.. పేరంటామా? నాకేం పని లేకుండా మీటింగులు పెడుతున్నానా? అధికారాలు లేని వారిని మీటింగ్‌కు పంపించి నా సమయం వృథా చేయాలని చూస్తున్నారా?!’’

నాకేం పని లేక మీటింగ్‌ పెట్టానా?

అధికారులపై ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆగ్రహం

సదరన్‌ మీటింగ్‌కు డీఎంఈ అధికారుల డుమ్మా 

శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు పయనం

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘‘ఇదేం పెళ్లా.. పేరంటామా? నాకేం పని లేకుండా మీటింగులు పెడుతున్నానా? అధికారాలు లేని వారిని మీటింగ్‌కు పంపించి నా సమయం వృథా చేయాలని చూస్తున్నారా?!’’ అంటూ ఆరోగ్యశాఖ అధికారులపై ఆ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో దివ్యాంగులకు సంబంధించిన సదరన్‌ క్యాంపుల పునఃప్రారంభంపై డీఎంఈ, ఏపీవీవీపీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీవీవీపీ కమిషనర్‌తో పాటు డీఎంఈలు కూడా హాజరుకావాలి.


అయితే, శుక్రవారం కావడంతో డీఎంఈ అధికారులు మధ్యాహ్నమే హడావుడిగా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కమిషనర్‌ వద్ద సదరన్‌కు సంబంధించిన మీటింగ్‌ ఉందని తెలిసినా పట్టించుకోలేదు. మరోవైపు ఈ సమావేశానికి డీఎంఈలు కింద స్థాయి సిబ్బందిని పంపించారు. దీంతో కమిషనర్‌ మరింత ఆగ్రహానికి గురైయ్యారు.


సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘సదరన్‌ క్యాంప్‌’ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ‘‘ఇలా అయితే సదరన్‌ నడవడం కష్టం. దీనిని ముందుకు తీసుకువెళ్లలేనని ముఖ్య కార్యదర్శికి లేఖ రాస్తా’’ అని హెచ్చరించారు. 


Updated Date - 2020-10-24T09:01:54+05:30 IST