కొందరి కళ్లు నీలిరంగులో, మరికొందరి కళ్లు గోధుమ రంగులో ఎందుకు ఉంటాయంటే...
ABN , First Publish Date - 2022-08-11T14:31:19+05:30 IST
చాలా మంది కళ్ళు గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి.
చాలా మంది కళ్ళు గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మరికొందరు నీలి రంగు కళ్ళు కలిగివుంటారు. నిజానికి కంటి రంగు అనేది మనిషి జన్యువులకు సంబంధించినది. కంటి రంగు అనేది శరీరంలోని మెలనిన్ శాతాన్ని అనుసరించి ఉంటుంది. దీనితో పాటు ప్రోటీన్ సాంద్రత, చుట్టూ ఉన్న కాంతి కూడా రంగును నిర్ణయించడంలో ప్రభావం చూపుతాయి. కంటి రంగు తొమ్మిది వర్గాలుగా విభజించారు. కంటి రంగుతో సంబంధం ఉన్న 16 జన్యువులు శరీరంలో ఉంటాయి.. కంటి రంగుకు కారణమయ్యే రెండు ప్రధాన జన్యువులు OCA2 , HERC2. రెండూ క్రోమోజోమ్ 15లో ఉన్నాయి. HERPC2 జన్యువు OCA2 యొక్క వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. HERC2 నీలి కళ్ళకు కొంతవరకు కారణంగా నిలుస్తుంది. అదే సమయంలో, OCA2 కొంతవరకు నీలం, ఆకుపచ్చ కళ్ళతో సంబంధం కలిగి ఉంటుంది.
ప్రపంచంలో చాలా మందికి గోధుమ రంగు కళ్ళు ఉంటాయి. ఎందుకంటే దీన్ని అభివృద్ధి చేసే జన్యువులు చాలా మందిలో ఉంటాయి. నీలి కళ్ళు ఉన్న వ్యక్తుల సంఖ్య ప్రపంచంలోనే చాలా తక్కువ. సుమారు 6 వేల నుండి 10 వేల సంవత్సరాల క్రితం మానవ జన్యువులలో మార్పు వచ్చిందని, దీని కారణంగా చాలామంది కళ్ళ రంగు నీలం రంగులోకి మారడం ప్రారంభించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజానికి ఈ బూడిద రంగు కళ్లు కలిగినవారిలో మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో కేవలం 2% మందికి మాత్రమే ఆకుపచ్చ కళ్ళు ఉన్నాయి. ఇది వారి కంటిలో మెలనిన్ పరిమాణం తగ్గడం వల్ల జరుగుతుంది. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఎదుగుదల ప్రారంబదశలో కళ్ళ రంగు చాలా వేగంగా మారుతుంది. నీలి కళ్ళతో జన్మించినవారి కళ్లు కాలానుగుణంగా రంగు గోధుమ రంగులోకి మారడం చాలాసార్లు జరుగుతుంది.