నాటి ఇళ్లకు..నేడు చెల్లింపులు ఎందుకు?

ABN , First Publish Date - 2021-12-07T06:07:17+05:30 IST

గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఇళ్లకు రూ.10 వేలు వసూలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయడం సరికాదని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు.

నాటి ఇళ్లకు..నేడు చెల్లింపులు ఎందుకు?
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేస్తున్న తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత


 ‘ఓటీఎస్‌’పై విరుచుకుపడిన తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత 

ఎస్‌.రాయవరం, డిసెంబరు 6 : గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఇళ్లకు రూ.10 వేలు వసూలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయడం సరికాదని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం ఎస్‌.రాయవరం మండలం అడ్డురోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం ఓటీఎస్‌ పథకంపై అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఇళ్లపై పూర్తి హక్కు లబ్ధిదారులకు ఉందని  రిజిస్ట్రేషన్‌ చేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, చంద్రబాబునాయుడు హయాంలో నిర్మించిన ఇళ్లకు పదివేల రూపాయల చొప్పున వసూలు చేయ డం ఏమిటని ప్రశ్నించారు.  ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలెవ్వరూ ఓటీఎస్‌కు డబ్బులు కట్టవద్దన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పింఛన్లు, రేషన్‌ నిలిపివేస్తామని చెబితే టీడీపీ నాయకుల దృష్టికి తీసుకురావాలని కోరారు.  మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు నల్లపరాజు వెంకటరాజు, కొప్పిశెట్టి వెంకటేశ్‌, పెదిరెడ్డి చిట్టిబాబు, లాలం కాశీనాయుడు, సర్పంచ్‌ కె.నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:07:17+05:30 IST