వైసీపీలో ‘కొవిడ్-19’ కలకలం
ABN , First Publish Date - 2020-06-05T11:09:32+05:30 IST
వైఎస్సార్ సీపీకి చెందిన ముఖ్య నాయకులకు కరోనా పాజిటివ్ రావడంతో పి.గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ ..
కరోనా నిబంధనలు గాలికొదిలి అట్టహాసంగా ప్రారంభోత్సవాల ఫలితం
పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు సహా వ్యక్తిగత సిబ్బందికి కొవిడ్ పరీక్షలు
అయినవిల్లిలో వైసీపీ ముఖ్య నాయకుడికి కరోనా పాజిటివ్తో బెంబేలు
సన్నిహితంగా ఉన్న 100 మందికి పైగా నేతలకు పరీక్షలు
ఆందోళనలో అధికారులు, పార్టీ నాయకులు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ సీపీకి చెందిన ముఖ్య నాయకులకు కరోనా పాజిటివ్ రావడంతో పి.గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు కలవరపడుతు న్నారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వైసీపీ నాయకుడు, అతని భార్యకు కరోనా పాజిటివ్ రావ డంతో అమలాపురంలోని కిమ్స్ కొవిడ్ ఆసుపత్రికి తర లించారు. గురువారం అయినవిల్లి మండలానికి చెందిన ఆ పార్టీకి చెందిన మరో నాయకుడికి కూడా కరోనా సోకినట్టు అధికారులు ధ్రువీకరించారు. అతడిని కిమ్స్ కోవిడ్ ఆసుప త్రికి తరలించారు. వీరిద్దరి కాంటాక్టుల్లో వంద మందికి పైగానే వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అధికా రులు ఉండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాల ప్రారంభోత్సవాలను వేడుకల్లా నిర్వహించారు.
కనీసం మాస్కులు ధరించడం గానీ, భౌతికదూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా జనసందోహంతో కార్యక్రమాలు చేస్తున్న తీరు కొవిడ్ వ్యాప్తికి కారణ మవుతోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత నెల 30 నుంచి రెండు రోజుల పాటు రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి అయినవిల్లికి చెందిన నాయకుడు విస్తృతంగా పర్యటించడంతో వారంతా ఆందోళన చెందుతు న్నారు. గురువారం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఆయన గన్మెన్, పీఏ, కుమారుడితోపాటు మొత్తం ఎనిమిది మందికి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వైద్య సిబ్బంది పి.గన్నవరంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వీరితో పాటు అంబాజీపేట, పి.గన్నవరంనకు చెందిన అధికారులు, అనధికారులు మరో పది మంది వరకు పరీక్షలు చేయించు కున్నారు.
కాగా ఎన్.పెదపాలెంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సన్నిహితంగా మెలగిన 33 మందికి, అయినవిల్లిలో పాజి టివ్ వచ్చిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న మరో 37 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మంగాదేవి వెల్లడించారు. ఈ ఫలితాలు శుక్రవారం వెలువడ తాయన్నారు. కాగా వీరవల్లిపాలెంలో మరో 33 మందికి పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొందరికి కరోనా వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అధికారులు గుర్తించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలందరినీ తమతమ ఇళ్లలోనే హోంక్వారంటైన్లో ఉండాలని అధికారు లు ఆదేశించారు. నియోజకవర్గవ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాలతోపాటు అమలాపురంలోని మరో ముఖ్య నేతతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు అల్లవరం మండలంలో ఒక వైసీపీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి పాల్గొన్నారు. దాంతో అక్కడ కూడా కలవరం మొదలైంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో వైసీపీ నేతలు సన్నిహితంగా మెలగడంతో ఇప్పుడు వారంతా వైద్య పరీక్షల కోసం వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు.