చైనా పేరెత్తడానికి జంకుతున్నారు : కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-08-15T19:17:51+05:30 IST

ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రసంగం ముగియగానే ప్రధానిపై కాంగ్రెస్ విరుచుకుపడింది.

చైనా పేరెత్తడానికి జంకుతున్నారు : కాంగ్రెస్

న్యూఢిల్లీ : ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రసంగం ముగియగానే ప్రధానిపై కాంగ్రెస్ విరుచుకుపడింది. అధికారంలో ఉన్న వారు చైనా పేరెత్తడానికి జంకుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే వారికి ఎల్‌ఓసీ మొదలు ఎల్‌ఏసీ వరకూ సైన్యం దీటైన జవాబిచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అయితే... చైనా పేరును మాత్రం మోదీ ప్రస్తావించలేదు. చైనా పేరును ఎత్తడానికి అధికార పక్షం భయపడుతోందని కాంగ్రెస్ విరుచుకుపడింది.


‘‘కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు 130 కోట్ల మంది భారతీయులకు మన సైన్యంపై పూర్తి విశ్వాసముంది. చైనాకు దీటైన జవాబిచ్చిన సైన్యానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. కానీ అధికార పక్షంలో ఉన్న వారి సంగతేంటి? చైనా పేరెత్తడానికే వారెందుకు జంతుకుతున్నారు?’’ అని సూర్జేవాలా సూటిగా ప్రశ్నించారు. భారత భూభాగంలోకి చైనా ప్రవేశించినపుడే ఎప్పుడు ప్రవేశించింది? వెనక్కి పంపడానికి సర్కార్ తీసుకున్న చర్యలేంటని ప్రజలు నిలదీయాల్సి ఉండిందని ఆయన అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా ఇలా ప్రశ్నించడమే నిజమైన ప్రజాస్వామ్యమని సూర్జేవాలా అన్నారు. 

Updated Date - 2020-08-15T19:17:51+05:30 IST