ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్ర ప్రపంచానికి తెలుసు : భారత్

ABN , First Publish Date - 2020-10-30T02:10:40+05:30 IST

ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్న విషయం యావత్తు ప్రపంచానికి తెలుసునని,

ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్ర ప్రపంచానికి తెలుసు : భారత్

న్యూఢిల్లీ : ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్న విషయం యావత్తు ప్రపంచానికి తెలుసునని, దీనిని ఎంతగా నిరాకరించినా సత్యాన్ని దాచిపెట్టలేరని భారత్ స్పష్టం చేసింది. అమెరికా-భారత్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో క్రాస్ బోర్డర్ టెర్రరిజం, పాకిస్థాన్ ప్రస్తావన ఉండటం పట్ల పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ ఘాటుగా స్పందించింది. 


భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదుల్లో అత్యధికులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశం తాను బాధితురాలినని చెప్పుకునే ప్రయత్నం చేయరాదన్నారు. ఉగ్రవాదానికి మద్దతివ్వడంలో పాకిస్థాన్ పాత్ర గురించి యావత్తు ప్రపంచానికి తెలుసునని చెప్పారు. ఉగ్రవాదంలో తమ పాత్ర గురించి పాకిస్థాన్ నేతలు సైతం అనేకసార్లు మాట్లాడారన్నారు. ఇండో-యూఎస్ జాయింట్ స్టేట్‌మెంట్‌పై పాకిస్థాన్ స్పందనపై మీడియా అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఈ సమాధానం చెప్పారు. 


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ఇండో-యూఎస్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ చర్చల అనంతరం ఇరు దేశాలు మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అన్ని రూపాల్లోని క్రాస్ బోర్డర్ టెర్రరిజంను గట్టిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఉగ్రవాద దాడులకు తన భూభాగాన్ని ఉపయోగించకుండా ఉగ్రవాదులపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాయి. 


దీనిపై పాకిస్థాన్ బుధవారం స్పందించింది. ఇండో-యూఎస్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్‌ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తనను ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదని పాకిస్థాన్ పేర్కొంది. 


Updated Date - 2020-10-30T02:10:40+05:30 IST