వైఎస్ కుటుంబంలో ఎవరిని ఎవరు చంపుతారో!?
ABN , First Publish Date - 2022-07-01T08:59:38+05:30 IST
వైఎస్ కుటుంబంలో ఎవరిని ఎవరు చంపుతారో!?
విజయలక్ష్మి, షర్మిల, అనిల్కు రక్షణ కల్పించండి
కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఆనం విజ్ఞప్తి
నెల్లూరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ‘‘గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి మరణించగా ఆ నిందను టీడీపీపై వేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వైఎస్ కుటుంబంలో ఎవరిని ఎవరు చంపుతారోనన్న అనుమానం కలుగుతోంది’’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్కు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆనం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్రెడ్డిది ప్రమాదం కాదు హత్య అని, రిలయన్స్ వాళ్లు చేశారంటూ నాడు జగన్ పత్రికలో రాశారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి మరణంపై ఒక్క సిట్ను కూడా వేయలేదన్నారు. పైగా రిలయన్స్ అధినేత తన ఇంటికొస్తే చేతులు కట్టుకొని నిలబడడమే కాకుండా రాజ్యసభ సీటు కూడా ఇచ్చారని విమర్శించారు. వీటిని బట్టి జగన్మోహన్రెడ్డే వైఎ్సఆర్ను చంపించారని అనుకోవాలా అని ప్రశ్నించారు. జగన్ పత్రికకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆయన చానెల్ అనుమతులను కేంద్రం ఎందుకు రద్దు చేసిందో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. ఆదాన్ డిస్టిలరీ కంపెనీని 2019, డిసెంబరులో స్థాపించారని, గడిచిన రెండేళ్లలో 50 శాతానికిపైగా మద్యం వ్యాపారాన్ని ఆ కంపెనీకు అప్పగించారని ఆరోపించారు. ఇది జగన్ సూట్కేస్ కంపెనీ అని ఆనం ఆరోపించారు.