ప్రపంచ ఫార్మసీ హబ్‌గా భారత్ : డబ్ల్యూహెచ్‌ఓ సైంటిస్ట్

ABN , First Publish Date - 2021-10-04T01:17:15+05:30 IST

భారత దేశం ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుండటం

ప్రపంచ ఫార్మసీ హబ్‌గా భారత్ : డబ్ల్యూహెచ్‌ఓ సైంటిస్ట్

న్యూఢిల్లీ : భారత దేశం ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుండటం గొప్ప విజయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. పోలియో నిర్మూలన, ప్రసూతి, శిశు మరణాల రేటు తగ్గుదల, యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ప్రపంచ ఫార్మసీగా ఎదగడం అద్భుత విజయాలని  ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. 


కోవిడ్-19 మహమ్మారి వల్ల భారత దేశంతో సహా దాదాపు ప్రతి దేశంలోనూ అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రభావితమయ్యాయని చెప్పారు. క్షయ వ్యాధికి చికిత్స, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, చైల్డ్ హెల్త్ సర్వీసెస్ విషయంలో భారత దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రానున్న కొద్ది నెలల్లో మరింత ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో తట్టుకోగలిగే సామర్థ్యాన్ని పెంచాలన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సంక్షోభాలు ఏర్పడితే ఇతర అత్యవసర ఆరోగ్య సేవలను అందజేయడంలో రాజీ పడకుండా ఎదుర్కొనగలిగే సమర్థతను పెంచాలని చెప్పారు. 


పేదరికాన్ని కోవిడ్ మహమ్మారి పెంచిందన్నారు. దీనివల్ల ప్రజలకు తగిన పోషకాహారం అందని పరిస్థితి తీవ్రమవుతుందని చెప్పారు. సరైన పోషకాహారం అందకపోతే క్షయ వంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెప్పారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించాలని, ముందస్తు నిరోధక చర్యలు చేపట్టాలని అన్నారు. 


Updated Date - 2021-10-04T01:17:15+05:30 IST