రతన్ టాటాకు త్రివర్ణ పతాకాన్ని అందించిన మహిళ ఎవరు?... ఆనంద్ మహీంద్రాతోనూ ఆమె ఫొటో దిగారే..
ABN , First Publish Date - 2022-08-14T16:35:30+05:30 IST
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఇద్దరు పారిశ్రామికవేత్తలకు త్రివర్ణ పతాకాన్ని అందజేస్తున్న మహిళ ఆసక్తికరంగా మారారు. ఆ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తల పక్కన ఆ మహిళ ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీనిని చూశాక ఈ పారిశ్రామికవేత్తలకు జాతీయ జెండాను ఇస్తూ కనిపించిన ఆ మహిళ ఎవరు అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది.
ఆమె మరెవరో కాదు... ముంబై పోస్ట్మాస్టర్ జనరల్ స్వాతి పాండే. ఆనంద్ మహీంద్రా ఈ ఫోటోను ట్వీట్ చేసి ఇలా రాశారు 'హర్ ఘర్ తిరంగా అభియాన్' కింద ముంబై పోస్ట్ మాస్టర్ జనరల్ స్వాతి పాండే నుంచి త్రివర్ణ పతాకాన్ని అందుకోవడం గౌరవంగా ఉంది. మన పోస్టల్ వ్యవస్థలో జెండాను అత్యున్నతంగా నిలిపినందుకు స్వాతికి ధన్యవాదాలు. ఇది ఎప్పటికీ మన దేశపు గుండె చప్పుడు'.. కాగా రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాలకు స్వాతి పాండే త్రివర్ణ పతాకాన్ని బహూకరించిన ఫొటోను పోస్టల్ శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. స్వాతి పాండే పోస్ట్మాస్టర్ జనరల్గా ఇండియా పోస్ట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె 2016 నుండి 2018 వరకు చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి సీఈఓగా కూడా పనిచేశారు. స్వాతి పాండే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో, పోస్టల్ శాఖ 10 రోజుల్లో కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించింది. భారత తపాలా శాఖ 20 అంగుళాల వెడల్పు, 30 అంగుళాల పొడవున్న త్రివర్ణ పతాకాన్ని కేవలం రూ.25కే ప్రజలకు అందిస్తోంది.