బతికుండగానే.. రికార్డుల్లో చంపేశారు

ABN , First Publish Date - 2022-01-29T07:34:11+05:30 IST

సజీవంగా ఉన్న ఓ వృద్ధురాలిని అధికారులు తమ రికార్డుల్లో చంపేశారు.

బతికుండగానే.. రికార్డుల్లో చంపేశారు

13 నెలలుగా పింఛను అందక వృద్ధురాలి అవస్థ 

లింగాలఘణపురం జనవరి 28: సజీవంగా ఉన్న ఓ వృద్ధురాలిని అధికారులు తమ రికార్డుల్లో చంపేశారు. కొంతమంది సిబ్బంది చేసిన ఈ పొరపాటుకు ఫలితంగా ఫించను ఆగిపోవడంతో ఆ మహిళ 13 నెలలుగా అవస్థలు పడుతోంది. తన సమస్యను పరిష్కరించమని అధికారులను వేడుకున్నా పట్టించుకునే వారు లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తోంది. జనగామ జిల్లా లింగాలఘణపురానికి చెందిన నాగిడి అంజమ్మ అలియాస్‌ ఆండాలుకు రాష్ట్ర ప్రభుత్వం 2014లో వితంతు పెన్షన్‌ మంజూరు చేసింది. 2020 డిసెంబరులో అకస్మాత్తుగా పింఛన్‌ ఆగిపోయింది. దీంతో ఆమె అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలి తం లేకపోయింది. చివరికి ఇటీవల గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌కు తన సమస్యను మొరపెట్టుకుం ది. దీంతో తనిఖీ చేయగా అంజమ్మ చనిపోయినట్టుగా ప్రభుత్వ రికార్డులో ఉన్నట్టు తెలిసిం ది. ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పు తమదికాదని మండల పరిషత్‌ కార్యాలయం అధికారులు, డీఆర్‌డీవో పెన్షన్‌ విభాగం అధికారులు తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు జరిగిన పొరపాటును సరిచేసి తిరిగి పింఛన్‌ ఇవ్వాలని ఆండాలు వేడుకుంటోంది. 

Updated Date - 2022-01-29T07:34:11+05:30 IST