బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ABN , First Publish Date - 2022-04-22T17:21:31+05:30 IST

నాకు అరవై ఐదేళ్లు. మధ్యవయసు దాటిన తరువాత నుండి క్రమంగా బరువు పెరుగుతూ వచ్చాను. శాకాహారిని. మోకాళ్ళ నొప్పులు తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలూ

బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(22-04-2022)

ప్రశ్న: నాకు అరవై ఐదేళ్లు. మధ్యవయసు దాటిన తరువాత నుండి క్రమంగా బరువు పెరుగుతూ వచ్చాను. శాకాహారిని. మోకాళ్ళ నొప్పులు తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలూ లేవు. బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- ఓంప్రకాష్‌, వరంగల్‌ 


డాక్టర్ సమాధానం: వయసు పెరుగుతున్నకొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గినట్టే ఎముకలు పెళుసుబారడం కూడా మొదలవుతుంది. వీటివలనే మోకాళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా పెళుసుబారడాన్ని తగ్గించడానికి , ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్‌ - డి చాలా అవసరం. ఈ రెండింటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌- కె ఎముకల నిర్మాణానికి, పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్పర్‌సను శరీరానికి అందిస్తాయి. కొన్ని రకాల ఆకు కూరల్లో కూడా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. పప్పు ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తుల నుంచి కూడా  మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్‌ - డి సూర్యరశ్మిలో తిరగడం వల్ల లభిస్తుంది. అలాగే విటమిన్‌ - డి తో ఫోర్టిఫై చేసిన పాలను తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్‌ - డి రెండూ లభిస్తాయి. ఇలా అన్ని రకాల కూరలు, పళ్ళు, ఆకుకూరలు, పాలు, పెరుగు ఉన్న సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. కానీ ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్‌ డ్రింక్స్‌, మాంసాహారం, కాఫీ తీసుకోవడం, ధూమపానం చేయడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది. ఇప్పటికైనా తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టడం వల్ల ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో ధాన్యాన్ని కాస్త తగ్గించి కాయగూరలు, ప్రొటీన్లు, ఆకు కూరలను అధికంగా తీసుకోవాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-04-22T17:21:31+05:30 IST