నా వయసు పదిహేడేళ్లే.. కానీ ఇపుడే ఎందుకిలా అవుతోంది?
ABN , First Publish Date - 2021-11-19T19:00:30+05:30 IST
నాకు పదిహేడేళ్లు. దూరంగా ఉన్న వస్తువులు, అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయి. కంటి చూపునకు మెరుగైన ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఆంధ్రజ్యోతి(19-11-2021)
ప్రశ్న: నాకు పదిహేడేళ్లు. దూరంగా ఉన్న వస్తువులు, అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయి. కంటి చూపునకు మెరుగైన ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- భాను, తిరుపతి
డాక్టర్ సమాధానం: కళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, ఆవశ్యక ఫాటీ యాసిడ్స్ తప్పనిసరి. కంటికి రక్తం చేరవేసే సూక్ష్మ రక్తనాళాల పని తీరుపై సాచ్యురేటెడ్ ఫాట్స్ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ ఫాట్స్ ఎక్కువగా ఉండే వేపుళ్ళు, బేకరీ ఫుడ్స్, జంక్ఫుడ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్ల కోసం అన్ని రకాల తాజాపండ్లు, కాయగూరలు కనీసం రోజులో రెండుసార్లు అయినా తీసుకోవాలి. ముఖ్యంగా ఎరుపు, బచ్చలి పండు రంగుల్లో ఉండే పండ్లు, కూరలైన టొమాటో, పుచ్చ, నేరేడు, బీట్రూట్, పర్పుల్ క్యాబేజీలను తరచుగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆవశ్యక ఫాటీ యాసిడ్స్ కోసం సాల్మన్ చేపలు, ఒమేగా-3 ఉన్న గుడ్లు, చేప నూనె సప్లిమెంట్లు; ఆక్రోట్, అవిసె, బాదం, పుచ్చగింజలు, గుమ్మడిపప్పు, నువ్వులు మొదలైనవన్నీ వీలున్నంత తీసుకోవాలి. ఆహారం మాత్రమే కాకుండా రోజుకు అరగంట వ్యాయామం చేయడం మంచిది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై, కంటికి చేరే రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చదువులో పడి నీళ్లు తాగడం మరిచిపోయినా కళ్ళ ఆరోగ్యం దెబ్బ తింటుంది. కాబట్టి తగినన్ని నీళ్లుతాగాలి. ఏ ఆరోగ్య సమస్యలు లేకున్నా వంశపారంపర్యంగా కూడా కొంతమందికి కంటి చూపు సమస్యలు వస్తాయి. ఈ విషయంలో వైద్యులను సంప్రదించడం మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)