ఎక్కడివారు అక్కడే...
ABN , First Publish Date - 2021-05-06T04:40:51+05:30 IST
కర్ఫ్యూ తొలిరోజు ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రహదారులు.. కూడళ్లు వెలవెలబోయాయి. అత్యవసర పనులపై వెళ్లేవారు తప్ప బయట పెద్దగా కనిపించలేదు. గత ఏడాది మార్చి 21న కర్ఫ్యూ విధించి మరుసటి రోజునుంచి లాక్డౌన్ ప్రకటించారు. ఈసారి ప్రభుత్వం కర్ఫ్యూను ప్రకటించింది.
నిర్మానుష్యంగా రహదారులు
షాపులన్నీ మూత..
తొలిరోజు కర్ఫ్యూ ప్రశాంతం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
కర్ఫ్యూ తొలిరోజు ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రహదారులు.. కూడళ్లు వెలవెలబోయాయి. అత్యవసర పనులపై వెళ్లేవారు తప్ప బయట పెద్దగా కనిపించలేదు. గత ఏడాది మార్చి 21న కర్ఫ్యూ విధించి మరుసటి రోజునుంచి లాక్డౌన్ ప్రకటించారు. ఈసారి ప్రభుత్వం కర్ఫ్యూను ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచి అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతిరోజూ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. విజయనగరం పట్టణంతో పాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల, ఎస్.కోట, గజపతినగరం, రామభద్రపురం, చీపురుపల్లి, గరివిడి పట్టణాలు.. మండల కేంద్రాల్లో కర్ఫ్యూ ప్రారంభమైంది. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. కిరాణా షాపులు, కిళ్లీ బడ్డీలు, కూరగాయల దుకాణాలు, విజయనగరం మార్కెట్, హోల్సేల్ షాపులు, వైన్ షాపులు ఇలా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలూ మూత పడ్డాయి. రవాణా రంగంపై కర్ఫ్యూ ప్రభావం కనిపించింది. ఆర్టీసీ సర్వీసులు మధ్యాహ్నం 12గంటలకే డిపోల్లోకి చేరిపోయాయి. పాల ఉత్పత్తుల దుకాణాలు, మందుల షాపులు తెరిచి ఉన్నాయి. వాహన రాకపోకలన్నీ నిలిచిపోయాయి. అంబులెన్స్లు, వైద్య సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూను అమలు చేసే పోలీస్ సిబ్బంది వాహనాలు మాత్రమే తిరిగాయి. జిల్లా సరిహద్దులు, అంతర్ రాష్ట్ర రోడ్డు మార్గాల వద్ద పోలీస్ శాఖ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పాక్షిక కర్ఫ్యూ కావడంతో రైళ్లన్నీ తిరగుతున్నాయి. ప్రయాణికులు మాత్రం పెద్దగా వెళ్లడం లేదు. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తప్ప ప్రయాణించేందుకు ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది.