కేసీఆర్‌ ఎక్కడ పుట్టారు?

ABN , First Publish Date - 2021-02-25T07:18:43+05:30 IST

తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న వైఎస్‌ షర్మిల.. తన స్థానికతపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు.

కేసీఆర్‌ ఎక్కడ పుట్టారు?

  • నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే
  • ప్రజల బాగోగులను పట్టించుకోని కేసీఆర్‌
  • కరోనా కష్టాల్లో ఫాంహౌస్‌కే పరిమితం
  • ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై దృష్టి పెట్టలేదు
  • వైఎస్సార్‌ పథకాలనే కాపీ కొట్టారు
  • ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారు
  • నేను ఎవరూ వదిలిన బాణాన్ని కాదు
  • పార్టీ పెడతా.. పాదయాత్ర చేస్తా
  • అమరుల కుటుంబాలను పరామర్శిస్తా
  • నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టంలేదు
  • రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నను ఎదిరించడానికి సిద్ధం
  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో వైఎస్‌ షర్మిల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న వైఎస్‌ షర్మిల.. తన స్థానికతపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎక్కడ పుట్టారని ప్రశ్నించారు. ఒకరు ఉద్యమం, మరొకరు మతం అంటూ రాజకీయాలు చేయడం తప్ప.. ప్రజల బాగోగులు పట్టించుకోవడంలేదన్నారు. బుధవారం లోట్‌సపాండ్‌లోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో షర్మిల ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనన్నారు. ‘‘నేను తెలంగాణలోనే పుట్టి పెరిగాను. నా భర్త అనిల్‌ ఇక్కడివారే. పిల్లలనూ ఇక్కడే కన్నాను. నాకు తెలంగాణలో పార్టీ పెట్టే హక్కు ఎందుకులేదు?’’ అని అన్నారు. జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తనకు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉందని, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. 


తాను తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించడం తన సోదరుడు జగన్‌కు ఇష్టంలేదని చెప్పారు. పార్టీ పెట్టే విషయంలో తన భర్త అనిల్‌ పూర్తి సహకారం ఉందని, తల్లి విజయమ్మ నుంచి కూడా పూర్తి మద్దతు ఉందని తెలిపారు. తాను ఎవరూ వదిలిన బాణాన్ని కాదని షర్మిల స్పష్టం చేశారు. ఏపీ సీఎంగా జగన్‌ ఆ రాష్ట్ర సంక్షేమాన్ని కోరితే, తెలంగాణ కోడలిగా తాను ఈ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుతున్నానని చెప్పారు. జగన్‌కు, తనకు మధ్య పార్టీ పరమైన విభేదాలు తప్ప.. వ్యక్తిగతమైన విభేదాలు లేవన్నారు. అయితే తెలంగాణ అభివృద్ధి కోసం తాను జగన్‌ను ఎదరించడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు తనకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినంత మాత్రాన తనకు తెలంగాణపై గౌరవం లేనట్టేనా? అని ప్రశ్నించారు.


వైఎస్సార్‌ పథకాలను కేసీఆర్‌ కాపీ కొట్టారు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కాపీ కొట్టారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమీ లేవన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా రోగుల నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకే పరిమితమయ్యారని, ఆస్పత్రుల దోపిడీపై దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయో కూడా ముఖ్యమంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కంటే ఉద్యోగాలు ఇవ్వడం మేలు కదా? అని అన్నారు.


 తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు గత ఏడాది ఆగస్టులోనే వచ్చిందని షర్మిల తెలిపారు. వైసీపీలో తనకు జగన్‌ ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదో ఆయననే అడగాలని వ్యాఖ్యానించారు. తాను జగన్‌ దగ్గర కూర్చొని గట్టిగా అడిగితే కోరిన పోస్టు ఇవ్వరా! అని ఓ ప్రశ్నకు సమాధానంగా షర్మిల చెప్పారు. తెలంగాణలో వైసీపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఆ పార్టీ వారు ఎవరైనా వస్తే స్వాగతిస్తామని తెలిపారు. ఇదే లోట్‌సపాండ్‌ నుంచి తన అన్న జగన్‌ గెలిచారని, తన పార్టీ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పారు. తెలంగాణలో తాను కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీపై ప్రకటన త్వరలోనే ఉంటుందన్నారు. పార్టీ అధికార ప్రతినిధుల వివరాలనూ వారం రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా తన పాదయాత్ర ఉంటుందని, మార్గమధ్యంలో అమరుల కుటుంబాలనూ పరామర్శిస్తానని తెలిపారు.

Updated Date - 2021-02-25T07:18:43+05:30 IST