జయలలిత బతికున్నప్పుడు దీప ఎక్కడున్నారు?
ABN , First Publish Date - 2020-08-08T14:50:15+05:30 IST
జయలలిత బతికున్నప్పుడు దీప ఎక్కడున్నారు?
ప్రశ్నించిన హైకోర్టు న్యాయమూర్తి
చెన్నై(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బతికున్నప్పుడు ఆమె మేన కోడలు దీప ఎక్కడున్నారు? ఎక్కడ నివశించారు? అంటూ హైకోర్టు న్యాయమూర్తి ఎన్.ఆనంద వెంకటేశన్ ప్రశ్నించారు. పోయెస్ గార్డెన్లోని జయ నివాసగృహం వేదానిలయాన్ని ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చనుండడంపై సవాలు చేస్తూ దీప దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. దీప తరఫున హాజరైన న్యాయ వాది జీజే భాస్కర్ నారాయణన్ తన వాదనలను వినిపిస్తూ జయ నివాసగృహం విలువ లెక్కగట్టేందుకు, దానికి సంబంధించిన నగదును సిటీ సివిల్ కోర్టులో జమ చేసే ఆధికారం ఆర్డీవోకు లేదన్నారు. వేదా నిలయం ప్రభుత్వ ఆస్తి కాదని, జయలలిత కష్టపడి సంపాదించి నిర్మించుకున్న భవన సముదాయమని తెలిపారు. ప్రభుత్వ తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ వాదిస్తూ దీప, ఆమె సోదరుడు దీపక్ జయలలిత ఆస్తులను విక్రయించగా వచ్చే సొమ్మును ఓ ట్రస్టు ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వు జారీ చేసినట్లు గుర్తు చేశారు. న్యాయమూర్తి ఎన్.ఆనందవెంకటేశన్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు ఇతర ఆస్తులను విక్రయించటం వల్ల వచ్చే సొమ్ముతో సామాజిక సేవలు చేస్తారని, అయితే వేదా నిలయాన్ని తమకు కావాలంటూ పట్టుబడుతున్న విషయాన్ని పరిశీలించాలన్నారు.
వేదా నిలయాన్ని స్మారక మందిరంగా మార్చకూడదంటూ పిటిషనర్ ఇదివరకే వేసిన పిటిషన్ విచారణ డివిజన్ బెంచ్లో పెండింగ్లో ఉందని దీనిపై విచారణ కూడా ఆ డివిజన్ బెంచ్కే మార్చాలని ప్రతిపాదిస్తానన్నారు. దీప తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ డివిజన్ బెంచ్ విచారణ జరిపేంతవరకూ వేద నిలయానికి విలువ కట్టి ఆర్డీవో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. న్యాయవాది పదేపదే స్టే కోరటంతో విసుగుచెందిన న్యాయమూర్తి ఎన్.ఆనంద వెంకటేశన్ జయలలిత బ్రతికున్నప్పుడు పిటిషనర్ దీప ఎక్కడున్నారు? ఏ ప్రాంతంలో నివసించేవారని ప్రశ్నించారు. అందుకు జయలలిత ముఖ్యమంత్రి కాక ముందు దీప, దీపక్ అంతా ఆమె నివాస గృహంలోనే కలిసి నివసించారని పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఈ పిటిషన్ విచారణ డివిజన్ బెంచ్కు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు.