ఆ నగదుఎక్కడిది?

ABN , First Publish Date - 2022-01-20T05:45:15+05:30 IST

రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు గడివేముల తహసీల్దార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఆ నగదుఎక్కడిది?
రైతులను ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు

ఆ పట్టాదారు పాసు పుస్తకాలు ఎందుకివ్వలేదు?
గడివేముల తహసీల్దార్‌ ఆఫీసులో ఏసీబీ తనిఖీ
పది గంటల పాటు సాగిన సోదాలు
రూ.43,980 అనధికార నగదు స్వాధీనం
పంపిణీ చేయని 33 పాసు పుస్తకాలు  


గడివేముల, జనవరి 19: రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు గడివేముల తహసీల్దార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఈ సోదాలు 10 గంటల పాటు సాగాయి. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో సీఐలు కృష్ణారెడ్డి, కృష్ణయ్య, వంశీనాథ్‌, ఇంతియాజ్‌బాషా తనిఖీల్లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది వద్ద అనధికార నగదు, పంపిణీకి నోచుకోని పట్టాదారు పాసుపుస్తకాలను వారు స్వాధీనం చేసుకున్నారు. మ్యూటేషన్‌, పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌లో మార్పు చేర్పుల కోసం డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను, మ్యూటేషన్‌ దరఖాస్తులను, వాటి రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. మ్యూటేషన్‌లు ఎన్ని జరిగాయి? ఎన్ని తిరస్కరించారు? ఇందుకు గల కారణాలు ఏవి? అని ఆరా తీశారు.

తలుపులు మూసి సోదాలు

ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ కార్యాలయ తలుపులు మూసివేసి సోదాలు ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దార్‌ సుభాకర్‌ వద్ద రూ.4,080, వీఆర్వో సామన్న వద్ద రూ.రూ.20,060, వీఆర్వో అబ్దుల్‌ కలామ్‌ వద్ద రూ.2,390, వీఆర్వో మౌళిబాషా వద్ద రూ.2,600, అటెండర్‌ మౌలాలి వద్ద రూ.1,550, నలుగురు సర్వేయర్ల వద్ద రూ.12,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారి వద్ద అధిక మొత్తంలో నగదు ఉంచుకున్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నగదుపై ఆరా తీశారు. పంపిణీకి నోచుకోని 33 పాసు పుస్తకాలను గుర్తించామన్నారు. తహసీల్దార్‌ నాగమణి వద్ద 23, వీఆర్వోల వద్ద 10 పాసుపుస్తకాలు ఉన్నట్లు తెలిపారు. రైతులు తమ సమస్యలను ఏసీబీ డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మ్యూటేషన్‌ తిరస్కరిస్తున్నారని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పాసుపుస్తకాలు రావడం లేదని, మ్యూటేషన్‌లు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై తహసీల్దార్‌ నాగమణిని విచారించారు. సమస్యలు పరిష్కరించడానికి అధికారులు డబ్బులు అడిగారా? అని ఏసీబీ అధికారులు రైతులను అడిగి తెలుసుకున్నారు. సోదాల్లో గుర్తించిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-20T05:45:15+05:30 IST