బంగారు తెలంగాణ అంటే కార్మికులను రోడ్డున పడేయడమేనా..?
ABN , First Publish Date - 2021-03-01T06:09:16+05:30 IST
బంగారు తెలంగాణ అంటే కార్మికులను రోడ్డున పడేయడమేనా..?
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి
మంగపేట, ఫిబ్రవరి 28: ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణ అంటే బిల్ట్ కార్మికులను రోడ్డున పడేయ్యడమేనా..? అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానాల అనంతరరెడ్డి వ్యాఖ్యానించారు. కమలాపురంలోని బిల్ట్ కర్మాగారాన్ని టీడీపీ బృందం ఆదివారం సందర్శించింది. అనంతరం గోదావరి బిల్ట్ ఇన్టేక్వెల్ వద్ద టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నందిగాం కృష్ణారావు అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ బిల్ట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేసి ఆరన్నర ఏళ్లు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ఫ్యాక్టరీపై ఆధారపడిన వందలాది మంది కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయని, వేతనాలు లేక అలమటిస్తుంటే, వారికి సరైన దారి చూపకపోవడం బాధాకరమని అన్నారు. విద్యుత్ బిల్లులను యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల మూడు నెలల నుంచి కార్మికుల కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయని, వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకపోవడం అమానుషమని విమర్శించారు. బిల్ట్ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, పరిశ్రమను పునుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీజీ నాయుడు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తిప్పనపెల్లి సుదర్శన్, టీడీపీ నాయకులు గాడిచర్ల కృష్ణ, కంకణాల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.