పంచాయతీ ఎన్నికల నిర్వహణ బిల్లులు ఎప్పుడిస్తారో?
ABN , First Publish Date - 2021-04-14T06:48:32+05:30 IST
ఫిబ్రవరి నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులు వేలాది రూపాయలు సొంత నిధులను ఖర్చు చేశారు.
పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 13: ఫిబ్రవరి నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులు వేలాది రూపాయలు సొంత నిధులను ఖర్చు చేశారు. ఎన్నికలు జరిగి నెలన్నర రోజులు కావస్తున్నా ఆ నిధులు నేటికీ విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శుల ఆవేదన చెందుతున్నారు. ఫిబ్రవరిలో నాలుగు విడతల్లో జిల్లాలోని 1368 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాల్లో షామియానా, కుర్చీలు, బారికేడ్లు, సిబ్బందికి భోజనాలు, శానిటైజర్లు, మాస్కుల కొనుగోలు, ఇతరత్రా ఏర్పాట్ల కోసం ఎంపీడీవోల సూచన మేరకు పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేశారు. ఈ విధంగా ఒక్కో పంచాయతీలో రూ.30నుంచి రూ.40వేల మధ్య ఖర్చు చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులన్నీ ఆయా ఎంపీడీవోలకు అందించారు. ఎన్నికలు జరిగి నెలన్నర రోజులు అవుతుండడంతో షామియానా, క్యాటరింగ్, తాగునీటి సరఫరా, శానిటైజర్లు ఇచ్చిన దుకాణదారులు రోజు పంచాయతీ కార్యదర్శుల వెంట పడుతున్నారు. వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియడం లేదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిల కోసం ఎంపీడీవోలను అడిగితే వచ్చిన బిల్లులు చెల్లించేశామని, డీపీవో నుంచి అదనంగా నిధులు విడుదలైతే ఇస్తామని చెబుతుండడంతో కార్యదర్శులకు దిక్కుతోచడంలేదు. ఈ విషయమై డీపీవో దశరథరామిరెడ్డిని ప్రశ్నిస్తే పంచాయతీరాజ్ అధికారుల సూచన మేరకు విడుదలైన రూ.5.50 కోట్ల బిల్లులు వేసి చెల్లించామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి బకాయిల బిల్లుల వివరాలు ఎంపీడీవోల నుంచి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.