వడ్డీ జమ ఎప్పుడో?
ABN , First Publish Date - 2022-01-28T06:16:50+05:30 IST
మహిళల అర్థిక స్వావలంబన కోసం పొదుపు సంఘాలకు అందించే రుణాలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తోంది. మూడేళ్లకు పైగా అందించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి.
- జిల్లాలో 39.84 కోట్ల బకాయిలు
- 2018- 2019 నుంచి పెండింగ్
- మూడేళ్లకు పైగా స్వశక్తి సంఘాల మహిళల నిరీక్షణ
- జిల్లాలో 1.11 లక్షల మంది స్వశక్తి మహిళలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
మహిళల అర్థిక స్వావలంబన కోసం పొదుపు సంఘాలకు అందించే రుణాలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తోంది. మూడేళ్లకు పైగా అందించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో స్వశక్తి సంఘాల మహిళలకు ఎదురు చూపులు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9654 మహిళా స్వశక్తి సంఘాలు, 147 దివ్యాంగుల సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో లక్షా 11 వేల 485 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవల 942 కొత్త సంఘాలను కూడా ఏర్పాటు చేసి రుణాలను అందిస్తున్నారు. బ్యాంక్ లింకేజీ ద్వారా లక్ష్యాన్ని అధిగమిస్తూ మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ జిల్లాను ముందు వరుసలో నిలుపుతున్నారు. రుణాలు పొందిన మహిళలు కూడా సకాలంలో వడ్డీ చెల్లిస్తూ అదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో మహిళా సంఘాలకు ఇచ్చిన వడ్డీలేని రుణాలకు సంబంధించి వడ్డీవాపస్ మాత్రం రావడం లేదు. గడిచిన మూడేళ్లకుపైగా వడ్డీ తిరిగి రాకపోవడంతో మహిళా సంఘాలకు భారంగా మారింది.
జిల్లాలో రూ.39.84 కోట్ల బకాయిలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2018-19 సంవత్సరం నుంచి వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 39.84 కోట్లు మహిళా సంఘాలకు జమ కావాల్సి ఉంది. 2018 -2019 సంవత్సరంలో 8173 సంఘాలకు రూ.8.87 కోట్లు, 2019-20లో 8309 సంఘాలకు రూ. 10.28 కోట్లు, 2020-21 సంవత్సరానికి 8327 సంఘాలకు రూ.14.47 కోట్లు, 2021-22 అక్టోబరు వరకు 7602 సంఘాలకు రూ.6.21 కోట్లు వడ్డీ రాయితీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 8377 సంఘాలకు రూ.39.84 కోట్లు రావాల్సి ఉండగా వడ్డీకోసం ఎదురు చూస్తున్నారు. స్వశక్తి సంఘాలకు 2021-2022 సంవత్సరానికి సంబంధించి రూ.334 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.289 కోట్లు చెల్లించారు. స్త్రీనిధి ద్వారా రూ.83.87 కోట్లు ఈ అర్థిక సంవత్సరం లక్ష్యం ఉండగా రూ.34.09 కోట్లు అందించారు.