చెల్లించేదెప్పుడు?
ABN , First Publish Date - 2022-08-11T05:29:46+05:30 IST
మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన లష్కర్లకు గత రెండేళ్లుగా వేతనాలు అందడంలేదు. దీంతో వారు ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నారు.
‘పెద్దగెడ్డ’ లష్కర్లకు రెండేళ్లుగా అందని వేతనాలు
అధికారులకు వినిపించని ఆకలి కేకలు
పాచిపెంట: మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన లష్కర్లకు గత రెండేళ్లుగా వేతనాలు అందడంలేదు. దీంతో వారు ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నారు. వేతన బకాయిల గురించి పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. వారితో పాటు స్పిల్వే ఆపరేటరు, వాచ్మెన్, హెల్పర ్లకు కూడా వేతనాలు అందడం లేదు. అసలు పెద్దగెడ్డ ప్రాజెక్టును 2006 సెప్టెంబరు 10న అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. 12 వేల ఎకరాలకు సాగునీరందే విధంగా ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికలు తీసేందుకు అప్పట్లో 22 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించారు. వారిలో ఆపరేటరు, వాచ్మెన్లు ముగ్గురు, హెల్పర్లు ఇద్దరు, లష్కర్లు 16 మంది ఉన్నారు. అయితే వారు నియమితులైనప్పటి నుంచి మూడు, నాలుగు నెలలకొకసారి వేతనాలు అందేవి. కాగా లష్కర్లకు నెలకు రూ. 12 వేల చొప్పున 2020 ఆగస్టు నుంచి వేతన బకాయిలు అందాల్సి ఉంది. దీనిపై ఈ నెల 8న స్పందనలో కలెక్టర్ నిశాంత్కుమార్కు వారు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాలో విజయనగరం కలెక్టర్ సూర్యకుమారికి కూడా వేతన బకాయిల విషయాన్ని తెలియజేశారు. ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా వేతన బకాయిలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పెద్దగెడ్డ ప్రాజెక్టు లష్కర్లు బోను వెంకటేష్, పాచిపెంట మనోజ్కుమార్ తదితరులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం
లష్కర్ల వేతనాల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. ప్రతి నెలా అమరావతి సెక్రటేరియట్కు లెటరు పంపిస్తున్నాం. అక్కడి నుంచి క్లియరెన్స్ రావల్సి ఉంది.
- బి.కనకారావు, డీఈఈ, పెద్దగెడ్డ ప్రాజెక్టు