పడుకునే ముందు పాలు లేదా పండ్లు తీసుకునే అలవాటు ఉందా..
ABN , First Publish Date - 2020-06-15T17:29:51+05:30 IST
నిద్రకు ఉపక్రమించే ముందు పాలు లేదా పండ్లను తీసుకునే అలవాటు మంచిదేనా?
ఆంధ్రజ్యోతి(15-06-2020)
ప్రశ్న: నిద్రకు ఉపక్రమించే ముందు పాలు లేదా పండ్లను తీసుకునే అలవాటు మంచిదేనా?
- శ్రీదేవి, మైదరాబాద్
డాక్టర్ సమాధానం: నిద్రపోయే సమయానికి కనీసం రెండు మూడు గంటల ముందు రాత్రి భోజనాన్ని ముగించడమనేది ఆరోగ్యకరమైన అలవాటు. కొన్నిసార్లు ఇలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల పడుకునే వేలకు ఆకలి అనిపించవచ్చు. అలాంటప్పుడు పండ్లు లేదా పాలు తీసుకుని నిద్రపోవడం కొంతమందికి అలవాటు. పాలు, పెరుగు, మజ్జిగ, జామ, అరటి, పుచ్చ, బొప్పాయి, అనాస, కివి మొదలైన పండ్లలో ట్రిప్టోఫాన్ అనే ఓ రకమైన అమైనోఆమ్లం ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్, నయసీనమైడ్ మొదలైన వివిధ రకాల రసాయనాలుగా రూపాంతరం చెందుతుంది. ఇందులో సెరోటోనిన్ ఆందోళన నియంత్రించేందుకు, మెలటోనిన్ చక్కటి నిద్రకు ఉపయోగపడతాయి. కాబట్టి నిద్రబోయే ముందు కొద్ది మోతాదులో, అంటే ఓ కప్పు పాలు తాగడం లేదా ఒక కప్పు పండ్లు తినడం వల్ల నిద్ర సరిగా పట్టే అవకాశం ఉంది. అలాగే పెందలాడే భోజనం చేసినప్పుడు రాత్రి నిద్రలో ఆకలి వేసి మెలకువ రాకుండా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. కేవలం పాలు, పండ్లే కాక, బాదం, ఆక్రోట్, పిస్తా లాంటి గింజలు కూడా ఐదారుకు మించకుండా నిద్రపోయేముందు తీసుకోవడం మంచిదే.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)