టీటీడీ ఉద్యోగులకు రెండో డోసు వ్యాక్సిన్ ఎప్పుడో?
ABN , First Publish Date - 2021-05-15T06:10:45+05:30 IST
తిరుపతిలో కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తమకు రెండో డోస్ ఎప్పుడు వేస్తారనే ఉత్కంఠలో టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.
తిరుపతి, మే 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తమకు రెండో డోస్ ఎప్పుడు వేస్తారనే ఉత్కంఠలో టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. టీటీడీ మొదటి డోస్గా వ్యాక్సిన్ను తమ ఉద్యోగులకు వేయించింది. తిరుపతి మొత్తానికి వచ్చిన వ్యాక్సిన్లో సగం టీటీడీనే తన పలుకుబడిని ఉపయోగించి తీసేసుకుంది. తిరుపతి నగర ప్రజలు ఎంతమంది వ్యాక్సిన్ వేసుకుని ఉంటే, అంత మంది టీటీడీ ఉద్యోగులూ వేసుకుని ఉండటం గమనార్హం. అలా వ్యాక్సిన్ వేసుకున్న వారు రెండో డోస్ అందుబాటులో లేకపోవటంతో టెన్షన్ పడుతున్నారు. టీటీడీ ఉద్యోగులుకు వెంటనే వ్యాక్సిన్ రెండో డోస్ వేయించాలని శుక్రవారం టీటీడీ ఉన్నతాధికారులకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెంకటేశ్, నాగార్జున, వెంకటరమణారెడ్డి, ప్రసాదరావు, ఇందిర, కల్పన, భాస్కర్, రత్న ప్రభాకర్ తదితరులు కలిసి విన్నవించారు. ఇక, టీటీడీ ఉద్యోగుల కోసం 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను చెన్నై నుంచి తిరుపతికి తెప్పించారు. అలాగే 13 కె.ఎల్ ఆక్సిజన్ ట్యాంకు కూడా బర్డ్లో ఇన్స్టాల్ చేశారు. ఆక్సిజన్ భర్తీ చేయాల్సి ఉంది. అది జరిగితే 150 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వస్తాయని టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫెర్ అసోసియేషన్ నేత చీర్ల కిరణ్ తెలిపారు. నిత్యం సాయంత్రం నాలుగు గంటలకు టీటీడీ ఉద్యోగులకు అందుతున్న వైద్యసేవలపై అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష చేస్తున్నారు.