ఫలితం ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-09-26T05:10:11+05:30 IST

‘మార్కుల’ కోసం వేలాది మంది డబ్బులు కట్టి ఎదురు చూస్తున్నారు. పరీక్షల్లో ఒక మార్కో, రెండు మార్కులు కలిస్తే పాస్‌ అవుతామని కొందరు, తాము రాసిన మేరకు మార్కులు రాలేదని మరికొందరు...ఇలా అనేక మంది పదో తరగతి విద్యార్థులు 2022 పరీక్షల ఫలితాలపై రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఫలితం ఎప్పుడో?
రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ అప్లికేషన్లు స్వీకరిస్తున్న ఏసీ, ఇతర అధికారులు (ఫైల్‌)


విడుదలకాని రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ఫలితాలు

రూ. 500, రూ. 1000 చెల్లించిన వేలాది విద్యార్థులు 

నేటికీ సమాచారం అందక ఎదురుచూపులు

జిల్లా అధికారుల్లోనూ  కొరవడిన స్పష్టత 

మార్కులు తగ్గిన, ఫెయిలైన విద్యార్థుల్లో టెన్షన్‌ 


అనంతపురం విద్య, సెప్టెంబరు 25:  ‘మార్కుల’ కోసం వేలాది మంది డబ్బులు కట్టి ఎదురు చూస్తున్నారు. పరీక్షల్లో ఒక మార్కో, రెండు మార్కులు కలిస్తే పాస్‌ అవుతామని కొందరు, తాము రాసిన మేరకు మార్కులు రాలేదని మరికొందరు...ఇలా అనేక మంది పదో తరగతి విద్యార్థులు 2022 పరీక్షల ఫలితాలపై రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 4494 మంది దరఖాస్తు చేయగా...వేలాది మందికి ఎలాంటి సమాచారం లేదు. రూ.అరకోటి వరకూ ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. కానీ విద్యార్థులకు మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ సమాచారం ఇవ్వడం లేదు. దీంతో పిల్లలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇటు స్కూల్‌ స్టాఫ్‌, అటు జిల్లా కేంద్రంలోని పరీక్షల విభాగం అధికారులను ఆశ్రయించి నా...మా చేతుల్లో ఏమీ లేదు అంటున్నారు. విజయవాడ నుంచి మీకే సమాచారం ఇస్తారంటూ చెబుతున్నారు. ఫీజుల చలానాలు చెల్లించి 3 నెలలు కావస్తున్నా ఫలితం శూన్యం. 


రెగ్యులర్‌లో ఇలా...

పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో నిర్వహించారు. జూన్‌ 6న ఫలితాలు విడుదల య్యాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 50,554 మంది హాజరు కాగా 25126 మంది ఉత్తీర్ణుల య్యారు. 49.70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అవకాశం కల్పిం చింది. రీ కౌంటింగ్‌కు అప్లై చేసే ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చెల్లించాలని, రీ వెరిఫికేషన్‌ తోపాటు తమ ఆన్సర్‌ సీట్స్‌ ఫొటో కాపీలు పొందాలంటే ప్రతి సబ్జెక్టుకు రూ. 1000 చెల్లించాలి. దీంతో భారీగానే  విద్యార్థులు క్యూ కట్టారు. జూన్‌ 20వ తేదీ ఆఖరి కావడంతో వేలాది మంది విద్యా ర్థులు చెల్లించారు. రెగ్యులర్‌ ఫలితాల తర్వాత రీ వెరిఫికేషన్‌కు 2828 మంది విద్యార్థులు రూ. 1000 చొప్పున  మొత్తం 28,28,000 చెల్లించారు.  రీ కౌంటింగ్‌కు 146 మంది రూ. 500 చొప్పున రూ.73,000 చెల్లించారు.


సప్లిమెంటరీలో...

జూలై నెలలో పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. 6 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించారు. ఆగస్టు 3న ఫలితాలు విడుదల చేశారు. 24161 మంది పరీక్షలకు హాజరు కాగా  13050 మంది ఉత్తీర్ణత సాధించారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు విద్యార్థులకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఆగస్టు 10వ తేదీ వరకూ కట్టించుకున్నారు. దీంతో సప్లిమెంటరీ పరీక్షల తర్వాత రీ వెరిఫికేషన్‌ 1,388 మంది మొత్తం 13,88,000 చెల్లించారు. రీ కౌంటింగ్‌కు 132 మంది రూ. 500 చొప్పున మొత్తం 66,000 చెల్లించారు. 


ఆదాయం కోసమేనా... 

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి భారీగానే విద్యార్థులు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఫీజులు చెల్లించారు. రెగ్యులర్‌, అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల తర్వాత 4494 మంది రూ. 43,55,000 చెల్లించా రు. ఈ సమయంలో రూ.1000 కడితే....పాస్‌ చేస్తారన్న వందంతుల నేపథ్యంలో భారీగా చెల్లించారన్న వాదనలు ఇటు ఉపాధ్యాయుల నుంచి, అటు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. కొందరు విద్యార్థులు రెండు, మూడు సబ్జెక్టులకు కూడా చలానాలు తీసి చెల్లించారు. దీంతో జిల్లా నుంచి ప్రభుత్వానికి దాదాపు రూ.అరకోటి వరకూ ఆదాయం వచ్చింది. అయితే డబ్బు చెల్లించిన విద్యార్థులకు ఇప్పటి వరకూ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. 


ఫెయిలైన విద్యార్థుల పరిస్థితి ఏంటో? 

రెండు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు డబ్బులు కట్టారు. అయితే డబ్బులు చెల్లించిన వారికి బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. విద్యార్థులు వారు 10వ తరగతి చదివి స్కూల్‌ వద్దకు, అనంతపురం నగరంలోని కేఎ్‌సఆర్‌లో ఏర్పాటుచేసిన సెంటర్‌ వద్దకు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే పరీక్షల విభాగం అధికారుల వద్ద కూడా దానికి సంబంధించిన సమా చారం లేకపోవడంతో విజయవాడ నుంచి విద్యార్థుల వద్దకే నేరుగా సమాచారం వస్తుందని చెప్పి పంపుతు న్నారు. అయితే 1 మార్కు, 2, 3 మార్కుల తేడాతో ఫెయిల్‌ అయిన విద్యార్థులు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ వల్ల కొంతైనా లాభం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకపోవ డంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. పైగా ఇంట ర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఈ మార్కులు ఎంతో అవసరం. 

 

Updated Date - 2022-09-26T05:10:11+05:30 IST