ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2021-10-20T06:05:33+05:30 IST

అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణతో స్థానిక సంస్థలకు ఆదాయం, విక్రయదారులకు ఊరట లభిస్తుందని భావించినా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనకు మోక్షం కలగడం లేదు.

ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షమెప్పుడో?

- క్రమబద్ధీకరణకు క్లస్టర్ల ఏర్పాటు 

- జిల్లాలో 43,149 దరఖాస్తులు పెండింగ్‌ 

- ఏడాదిగా ఎదురు చూపులు 

- స్థానిక సంస్థలకు ఆదాయం దూరం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అక్రమ లే అవుట్లు,  ప్లాట్ల క్రమబద్ధీకరణతో స్థానిక సంస్థలకు ఆదాయం, విక్రయదారులకు ఊరట లభిస్తుందని భావించినా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనకు మోక్షం కలగడం లేదు. అక్రమ లే అవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవడానికి గత సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబరు వరకు దరఖాస్తులను స్వీకరించారు. ప్లాట్‌కు మార్కెట్‌ విలువలో 33 శాతం జరిమానాతో  క్రమబద్ధీకరించాలనే ఆదేశాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 179 గ్రామ పంచాయతీల పరిధిలో,  సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 43,149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీ లించడానికి ఈ సంవత్సరం ఆగస్టులో సర్వే నంబర్లు, స్థల విస్తీర్ణం ప్రకారం క్లస్టర్‌లుగా విభజించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్లుగా విభజించినా ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ వంటివి అమలు కాలేదు. 

 ఏడాదిగా ఎదురు చూపులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 43,149 దరఖాస్తులు అందజేశారు.  వీరందరూ గత ఆగస్టు నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఎదురు చూడక తప్పడం లేదు. జిల్లాలోని 179 గ్రామ పంచాయతీల పరిధిలో 16,355 దరఖాస్తులు, సిరిసిల్ల మున్సిపాలిటీలో 10,524, వేములవాడలో 16270 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని బోయినపల్లి మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో 645 దరఖాస్తులు, చందుర్తి 15 గ్రామ పంచాయతీల్లో 230, ఇల్లంతకుంట 24 గ్రామ పంచాయతీల్లో 1054, గంభీరావుపేట మండలం  17 గ్రామ పంచాయతీల్లో 861, కోనరావుపేట 15 గ్రామ పంచాయతీల్లో 277, వేములవాడ అర్బన్‌ మండలం 9 గ్రామ పంచాయతీల్లో 3,909, ఎల్లారెడ్డిపేట మండలం 16 గ్రామ పంచాయతీల్లో 3,949, తంగళ్లపల్లి 26 గ్రామ పంచాయతీల్లో 3,784 దరఖాస్తులు, వేములవాడ రూరల్‌ మండలం  15 గ్రామ పంచాయతీల్లో 214, రుద్రంగి 2 గ్రామ పంచాయతీల్లో 304, వీర్నపల్లి  3 పంచాయతీల్లో 71 దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన అంశం హైకోర్టులో ఉండడంతో ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎలాంటి స్పష్టత లేకుండా పెండింగ్‌లో ఉండిపోయింది. 


Updated Date - 2021-10-20T06:05:33+05:30 IST