కార్యకర్తలకు ఏమి చేశారని..

ABN , First Publish Date - 2022-05-22T05:37:18+05:30 IST

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ‘‘బతికున్నప్పుడు పార్టీకోసం, మీకోసం పాటుపడ్డాడు. మృతిచెందాక సీఎం సహాయ నిధి మంజూరు కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది..

కార్యకర్తలకు ఏమి చేశారని..
ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ప్రశ్నిస్తున్న శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు

‘గడప గడప’లో ఎమ్మెల్యేకు చేదు అనుభవం

దువ్వూరు, మే 21: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ‘‘బతికున్నప్పుడు పార్టీకోసం, మీకోసం పాటుపడ్డాడు. మృతిచెందాక సీఎం సహాయ నిధి మంజూరు కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.. కార్యకర్తలకు ఏం చేశారని వచ్చారు’’ అంటూ దువ్వూరు మండలం మూడిండ్లపల్లె గ్రామానికి చెందిన ఆవుల శివరామిరెడ్డి భార్య నారాయణమ్మ, కుటుంబ సభ్యులు శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు నుంచి శివరామిరెడ్డి పార్టీకోసం పాటుపడ్డాడని, అనారోగ్యానికి గురై వైద్య ఖర్చులకోసం రూ.20 లక్షల వరకు ఖర్చు అయిందని నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆపరేషన్‌ కోసం కర్నూలులోని కిమ్‌ ఆస్పత్రిలో రూ.8 లక్షలు బిల్లులు అయ్యాయన్నారు. సీఎం సహాయ నిధి కోసం ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, చివరకు తన భర్త చనిపోయాడని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమకు ఎలాంటి సాయం అందలేదన్నారు. మరికొందరు మహిళలు అమ్మవొడి పడలేదని, ప్రభుత్వ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తె చ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబడి కృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, జడ్పీటీసీ మేరువ కృష్ణయ్య, సర్పంచ్‌ మంచాల రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:37:18+05:30 IST