సిండికేట్‌ను ఏం చేద్దాం!

ABN , First Publish Date - 2022-08-04T06:57:30+05:30 IST

తరతమ భేదాలు, పార్టీలను విస్మరించి మద్యం వ్యాపారులంతా ఒక్కటవటమే గాక పోటీదారులకు భారీమొత్తంలో చెల్లించారు. అయితే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఫిర్యాదుతో బుధవారం ఎస్‌ఈబీ ఉన్నతాధికారులు అసలేం జరిగిందనే విషయంపై దృష్టిసారించారు.

సిండికేట్‌ను ఏం చేద్దాం!

బాలినేని ఫిర్యాదుతో ఎస్‌ఈబీ ఉన్నతాధికారుల దృష్టి 

ఒంగోలులో బార్‌ లైసెన్స్‌ల వ్యవహారం 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తరతమ భేదాలు, పార్టీలను విస్మరించి మద్యం వ్యాపారులంతా ఒక్కటవటమే గాక పోటీదారులకు భారీమొత్తంలో చెల్లించారు. అయితే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఫిర్యాదుతో బుధవారం ఎస్‌ఈబీ ఉన్నతాధికారులు అసలేం జరిగిందనే విషయంపై దృష్టిసారించారు. ఇప్పటికే లైసెన్స్‌ ఫీజు వ్యాపారులు చెల్లించినందున ఎలా ఈ విషయంపై ముందుకెళ్లాలన్న కోణంలో వారు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈనెల 1 నుంచి బార్‌ లైసెన్స్‌లకు కొత్తవిధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒంగోలుతోపాటు మార్కాపురం, కందుకూరు, చీరాలలో లైసెన్స్‌ ఫీజు ఒక్కో బార్‌కు రూ.35లక్షలు, మిగిలిన నగరపంచాయతీల్లో రూ.15లక్షలుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో పాటలు నిర్వహించినప్పటికీ ఒంగోలులోని 15 బార్‌లకు పోటీ లేకుండానే పాత లైసెన్స్‌దారులే ఎక్కువమంది పొందారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కందుకూరుతోపాటు నగర పంచాయతీలైన చీమకుర్తి, అద్దంకిలలో కూడా లైసెన్స్‌ల కోసం వ్యాపారులు పోటీపడటంతో అక్కడ ఒక్కో షాపు కోటికిపైన పలికింది. ఒంగోలులో మాత్రం అత్యధికంగా రూ.39లక్షలు, అత్యల్పంగా రూ.37లక్షలకే దక్కించుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే బాలినేని కలెక్టరుకి ఫిర్యాదు చేయటంతో ఆయన విషయాన్ని ఎస్‌ఈబీ ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా అందిన సమాచారం మేరకు లైసెన్స్‌ల కోసం కొత్తగా కొందరు అప్లికేషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దాఖలు చేశారు. అయితే వారు పాటలో పాల్గొనకుండా వెనక్కి తగ్గారు. ఒక్కో దానికి తిరిగిరాని మొత్తంగా రూ.7.5 లక్షలు చెల్లించి దరఖాస్తు చేసి కూడా వారు పాటలో పాల్గొనకపోవటం వెనుక సిండికేట్‌ వ్యవహారం దాగి ఉందనేది తేటతెల్లమైంది. పోటీగా దరఖాస్తులు వేసిన వారికి సిండికేట్‌ పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి పాటలో పాల్గొనకుండా చేసినట్లు సమాచారం. అత్యధికంగా రూ. 50లక్షలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. వెనక్కు తగ్గేందుకు ససేమిరా అన్న ఇద్దరు ముగ్గురికి కొన్ని బార్‌ల లైసెన్స్‌ల్లో వాటాలు ఇచ్చినట్లు కూడా సమాచారం. వ్యాపారులలో వైసీపీ, టీడీపీ, జనసేనలకు చెందిన వారు కూడా ఉన్నారు. వారంతా కూడా పార్టీలు పక్కనబెట్టి వ్యాపారపరంగా సిండికేట్‌ అయి ముందుకుసాగారు. అయితే ఈ వ్యాపారుల్లో ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులు ఉండటంతో వైసీపీకి చెందిన కొందరు నాయకులు బాలినేని మీద ఒత్తిడి పెంచినట్లు సమాచారం. తదనుగుణంగానే బాలినేని సిండికేట్‌ వ్యవహారంపై ఫిర్యాదుచేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే కొత్త విధానం అమల్లోకి వచ్చి వ్యాపారులు లైసెన్స్‌ఫీజు కూడా చెల్లించినందున వారిని ఏవిధంగా ఇబ్బందిపెట్టవచ్చన్న విషయంపై అధికారులు దృష్టిసారించినట్లు ప్రచారం  జరుగుతోంది.


Updated Date - 2022-08-04T06:57:30+05:30 IST