ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..
ABN , First Publish Date - 2022-05-12T06:17:06+05:30 IST
రోజురోజుకూ పెరుగుతూపోతున్న వస్తు, సేవల ధరలు తమ కొనుగోలు నిర్ణయాలను, సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని మెజారిటీ భారతీయ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారని ఈవై సర్వే నివేదిక వెల్లడించింది.
కొనుగోలు నిర్ణయాలు, సామర్థ్యంపై ప్రభావం చూపుతోన్న వస్తు, సేవల ధరల పెరుగుదల
ఈవై సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరుగుతూపోతున్న వస్తు, సేవల ధరలు తమ కొనుగోలు నిర్ణయాలను, సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని మెజారిటీ భారతీయ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారని ఈవై సర్వే నివేదిక వెల్లడించింది. భారత మార్కెట్కు సంబంధించి ఈవై విడుదల చేసిన తొమ్మిదో విడత ‘ఫ్యూచర్ కన్స్యూమర్ ఇండెక్స్’ ప్రకారం.. పెరిగిన ధరలు తమకు ఇష్టమైన వస్తు కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది భారత వినియోగదారులు పేర్కొన్నారు. పెరుగుతూ పోతున్న జీవన వ్యయాలపై అనిశ్చితి కారణంగా గతంలో కంటే అధికంగా పొదుపు చేస్తున్నట్లు 80 శాతం మంది వెల్లడించారు. ఖర్చు చేయడానికి బదులు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని 50 శాతం మంది తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,000 మందికి పైగా దేశీయ వినియోగదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించినట్లు ఈవై తెలిపింది. ధరల పెరుగుదల భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపైనే అధిక ప్రభావం చూపుతోందని రిపోర్టు పేర్కొంది.
ఆరోగ్యం విషయంలో తగ్గేదేలే..!
భారత వినియోగదారుల్లో ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెరిగిందని, ధరల దండయాత్ర నేపథ్యంలోనూ అత్యున్నత, సేంద్రీయ ఆహారం కోసం అధిక ధర చెల్లించేందుకూ వెనుకాడట్లేదని ఈవై నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది వచ్చే 2-3 ఏళ్లలో భౌతిక ఆరోగ్యం మెరుగపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. దీర్ఘకాలంలో భౌతిక ఆరోగ్యంపై 80 శాతం మంది, 78 శాతం మంది మానసిక ఆరోగ్యంపై జాగ్రత్త ధోరణని వ్యక్తపర్చారు.
వచ్చే ఏడాదిపై ఆశావహం
ఆర్థిక పరిస్థితి వచ్చే ఏడాది మెరుగుపడవచ్చని సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది భారత వినియోగదారులు ఆశావహంగా ఉన్నారని ఈవై నివేదిక తెలిపింది. అంతర్జాతీయ సర్వే నివేదిక సగటు 48 శాతంతో పోలిస్తే ఇది చాలా అధికమని రిపోర్టు పేర్కొంది.
ధరల పెరుగుదలతో
ఎవరిపై ఎక్కువ ప్రభావం?
అల్పాదాయ వర్గం - 72%
అధికాదాయ వర్గం - 60%
మధ్యతరగతి వర్గం - 58%