జగనన్నా.. హామీ ఏమైందన్నా?
ABN , First Publish Date - 2021-04-21T06:42:33+05:30 IST
నేను సీఎం అయిన వెంటనే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా. జీతాలు పెంచి విధుల్లో కొనసాగిస్తా. - పాదయాత్రలో భాగంగా గురుకులాల్లోని ఇంగ్లిష్, ఐటీ శిక్షకులకు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీ
నేను సీఎం అయిన వెంటనే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా. జీతాలు పెంచి విధుల్లో కొనసాగిస్తా.
- పాదయాత్రలో భాగంగా గురుకులాల్లోని ఇంగ్లిష్, ఐటీ శిక్షకులకు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీ
గతేడాది లాక్డౌన్ నుంచి జీతాల్లేవు. ఉద్యోగ భద్రత మాటే లేదు. కుటుంబ పోషణకు ఏడాదిగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
- ఇదీ జగన్ సీఎం అయ్యాక ఆ ట్రైనర్ల పరిస్థితి.
జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్, ఐటీ వంటి లైఫ్స్కిల్స్లో శిక్షణ ఇవ్వడానికి 2018-19లో టీడీపీ ప్రభుత్వం ‘నైపుణ్య వికాసం’ కార్యక్రమాన్ని చేపట్టింది. 19 మంది ఇంగ్లిష్, 19 మంది (ఐటీ) కంప్యూటర్ బోధనకు.. జిల్లా వ్యాప్తంగా సమన్వయానికి ఇద్దరిని కో ఆర్డినేటర్లుగా నియమించింది. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఈ 40 మందిని.. నెలకు రూ.20వేల జీతంతో తీసుకున్నారు. ఎప్పటికైనా తమకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో.. ఇతర ఉద్యోగాలను వదిలి వీటిలో చేరారు. ఏపీఎస్ఎస్డీసీ స్కూల్ నెట్ ఏజెన్సీ ద్వారా మూడేళ్లపాటు విధులు నిర్వర్తించారు. ఆ క్రమంలో ప్రతిపక్ష నేతగా జిల్లాలో పాదయాత్ర చేసిన జగన్ను వీరు కలిసి వినతిపత్రం ఇవ్వగా.. ఉద్యోగ భద్రతపై హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఆ హామీని పట్టించుకోలేదు. ఇకనైనా జగన్ తన హామీని నెరవేర్చి.. ఏడాదగా పెండింగులో ఉన్న జీతాలను ఇప్పించాలని ట్రైనర్లు కోరుతున్నారు.
- గంగాధరనెల్లూరు