గాయం మానేదెన్నడు..?

ABN , First Publish Date - 2021-12-05T05:29:29+05:30 IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటికీ ఆనాటి ఆనవాళ్లు వెక్కిరిస్తున్నాయి. చూసిన వారికంతా కన్నీటిని తెప్పిస్తున్నాయి. నవంబరు 19వ తేదీన అన్నమయ్య ప్రాజెక్టు తెగి చెయ్యేరు ఉప్పొంగడంతో ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతినగా ప్రాణనష్టంతో

గాయం మానేదెన్నడు..?
హేమాద్రివారిపల్లెలో నేటికీ పునరుద్ధరణకు నోచుకోని రోడ్డు

నేటికీ ఎక్కడ చూసినా విధ్వంసపు ఆనవాళ్లే

వరద ప్రభావిత ప్రాంతాల్లో కన్నీటి దృశ్యాలు

రాజంపేట, డిసెంబరు 4 : వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటికీ ఆనాటి ఆనవాళ్లు వెక్కిరిస్తున్నాయి. చూసిన వారికంతా కన్నీటిని తెప్పిస్తున్నాయి. నవంబరు 19వ తేదీన అన్నమయ్య ప్రాజెక్టు తెగి చెయ్యేరు ఉప్పొంగడంతో ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతినగా ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం జరిగింది. మిగిలిన సుమారు 40 గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలో జరిగిన నష్టం ఇప్పటికీ వెలకట్టలేనిది. 

తాటిచెట్టంత ఎత్తున ఒకటిన్నర కిలోమీటరు వెడల్పుతో ప్రవహించిన వరద అన్ని గ్రామాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. వేలాది మోటారు సైకిళ్లు, వందలాది ట్రాక్టర్లు, కార్లు, వ్యవసాయ పనిముట్లు, బోరుబావులు, మోటార్లు ప్రతి ఇంటిలోని ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, ఇంటి సామగ్రి మొత్తం కొట్టుకుపోయాయి. ఇవన్నీ ఇప్పటికీ ఇక్కడివక్కడే ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. ఇక తమకు కూడుపెట్టే సుమారు 3వేల వరకు గొర్రెలు, 10వేల వరకు కోళ్లు, 1400 వరకు ఆవులు, గేదెలు కొట్టుకుపోయాయి. 10వేల ఎకరాల్లోని వరిపంట ఇసుక మేటతో కూరుకుపోగా మిగిలిన భాగం నీటిలో మునిగిపోయి కుళ్లిపోయింది. ఉద్యానవన పంటలైన మామిడి, టెంకాయ చెట్లు, ఇతరపంటలు 5వేల ఎకరాల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. 

అన్ని గ్రామాల్లో రోడ్లు ధ్వంసమైపోయాయి. వాటిని పునరుద్ధరించడం కష్టమైపోతోంది. ప్రధాన గ్రామాల్లో సింగిల్‌ఫేస్‌ కరెంటు కనెక్షన ఇవ్వగలిగారు కానీ పూర్తిస్థాయి కరెంటు ఇవ్వలేకపోతున్నారు. నది పరివాహక ప్రాంతాల్లోని నారాయణనెల్లూరు, పొత్తపి, పాటూరు, నాగిరెడ్డిపల్లె, తొగూరుపేట, రామచంద్రాపురం, అన్నగారిపల్లె, సాలిపేట, గుండ్లూరు, తాళ్లపాక, శేషమాంబపురం, హేమాద్రివారిపల్లె, లేబాక చుట్టుపక్కల వందలాది గ్రామాల్లో ట్రాన్సఫార్మర్లు, విద్యుత స్తంభాలు, తీగలు దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణ ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ పడిపోయినవి పడిపోయినచోటే నాటి సంఘటనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచివున్నాయి.

అధికారులు ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగా జరిగిన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం, విద్యుత సౌకర్యం, పారిశుధ్య సమస్య, నీటి వసతులు కొన్ని ప్రధాన గ్రామాలకు కల్పించారు తప్ప మిగిలిన ప్రాంతాల్లో వీటి పునరుద్ధరణ ఇంకా ఆలస్యమయ్యే అవకాశముంది. నేటికి 17 రోజులు అవుతున్నా ఎక్కడ చూసినా ఈ వరద విఽధ్వంసం మానని గాయంగా కలవరపెడుతోంది.


బావులకు విద్యుత సౌకర్యం కల్పించాలి

- ధర్మారెడ్డి, రామచంద్రాపురం 

బోరుబావులకు విద్యుత సౌకర్యం కల్పించాలి. తొగూరుపేట నుంచి పెనగలూరు వరకు అన్ని బోరుబావుల్లో కరెంటు పోయింది. మోటార్లు కొట్టుకుపోయాయి. కరెంటు స్తంభాలు లేవు. వెంటనే ఈ బోరుబావులను పునరుద్ధరించి కరెంటు సౌకర్యం కల్పించాలి. 


వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి

- జొన్నా శివరామయ్య, తొగూరుపేట 

పులపత్తూరు నుంచి మందపల్లె, తొగూరుపేట, రామచంద్రాపురం, గుండ్లూరు, పాటూరు ఇలా 40 గ్రామాల్లో వున్న వందలాది మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ కొట్టుకుపోయిన ప్రాంతాల్లోనే పూడిపోయి ఉన్నాయి. వీటిని గుర్తించి సంబంధిత వాహనాదారులకు నష్టపరిహారం చెల్లించాలి.


నేలమట్టమైన చెట్లకు నష్టపరిహారం ఇవ్వాలి

- గుండ్లూరు నాగేశ్వర, సాలిపేట 

చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలో పడిపోయిన మామిడి, టెంకాయ తదితర ఉద్యానవన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. వందలాది హెక్టార్ల భూముల్లో ప్రతి ఏడాది లక్షల ఆదాయాన్ని ఇచ్చే మామిడి చెట్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. నదికి ఆనుకొని ఉన్న టెంకాయి చెట్లన్నీ కొట్టుకుపోయాయి. వీటన్నింటికీ నష్టపరిహారం ఇవ్వాలి. 



Updated Date - 2021-12-05T05:29:29+05:30 IST