మీరిద్దరూ భార్యాభర్తలని గ్యారంటీ ఏంటీ..!?
ABN , First Publish Date - 2022-05-03T08:41:59+05:30 IST
‘మీరిద్దరూ భార్యా భర్తలేనా? ఆమె నీ భార్య అని గ్యారంటీ ఏంటీ?.. నీ కులం ఏంటి?’
- అర్ధరాత్రి వేళ దంపతుల పట్ల..
- పెట్రోలింగ్ పోలీసుల అసభ్యప్రవర్తన
- ఖమ్మం సీపీకి బాధితుల ఫిర్యాదు..
- విచారణకు ఆదేశం
ఖమ్మం, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘మీరిద్దరూ భార్యా భర్తలేనా? ఆమె నీ భార్య అని గ్యారంటీ ఏంటీ?.. నీ కులం ఏంటి?’ ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామానికి వెళుతున్న దంపతులను అర్ధరాత్రి వేళ ఆపిన పెట్రోలింగ్ పోలీసులు అడిగిన ప్రశ్నలివి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురానికి చెందిన బొమ్మగాని దుర్గారావు, ఆయన భార్య భవాని, ఆమె సోదరుడు వెంకటేష్ హైదరాబాద్ నుంచి కమలాపురానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. శనివారం అర్ధరాత్రి 12:20 గంటల సమయంలో నేలకొండపల్లి వద్ద పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆపారు. వారిపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారు. ఆ మహిళ మెడలోని తాళిబొట్టు, వారి పెళ్లిఫొటోలు, గుర్తింపు కార్డులు తనిఖీ చేసిన తర్వాత కూడా దురుసుగా నడుచుకున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని బస్సు టికెట్లు చూపించమని అడిగారు. ఇదంతా వీడియో తీసేందుకు ప్రయత్నించగా పోలీసులు తమ సెల్ఫోన్ లాగేసుకున్నారని బాధితులు చెబుతున్నారు. ఆ సమయంలో పెట్రోలింగ్ సిబ్బంది మద్యం మత్తులో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా డీజీపీ మహేందర్రెడ్డికి, సీఎంవో కార్యాలయానికి, మంత్రి కేటీఆర్, మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఆదివారం తీసుకెళ్లిన బాధితులు.. ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్కు సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఖమ్మం అడిషనల్ డీసీపీ గౌస్ ఆలం నేలకొండపల్లి పోలీ్సస్టేషన్లో విచారణ చేపట్టారు.