కాలుష్య నియంత్రణపై ఏం చేయబోతున్నారు?
ABN , First Publish Date - 2021-12-03T08:01:35+05:30 IST
రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారో 24 గంటల్లోగా తెలియజేయాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీచేసింది.
- 24 గంటల్లోగా సమాధానం చెప్పండి..
- కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం అల్టిమేటం
న్యూఢిల్లీ, డిసెంబరు 2: రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారో 24 గంటల్లోగా తెలియజేయాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీచేసింది. కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ఆచరణలో ఏమీ జరగడం లేదని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో అధికారులు విఫలమైతే తామే అసాధారణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు సమయం వృధా అవుతున్నట్టు భావిస్తున్నామని, సమస్య పరిష్కారానికి సరైన సూచనలతో రావాలని ధర్మాసనం పేర్కొంది. కోర్టు లేవనెత్తిన అంశాలపై స్పందించడానికి ఒక రోజు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాఅభ్యర్థించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ స్పందిస్తూ... కాలుష్యంపై మాజీ న్యాయమూర్తి ఆర్.ఎఫ్.నారిమన్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ను ఏర్పాటుచేయాలని కోరారు. శుక్రవారం మళ్లీ వాదనలు వింటామని కోర్టు పేర్కొంది.