మీరేం చేస్తున్నట్టు?.. త్రిపుర సర్కార్‌ను నిలదీసిన సుప్రీం

ABN , First Publish Date - 2021-11-23T19:20:49+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజురోజుకూ త్రిపురలో హింస పెరుగుతోందంటూ టీఎంసీ దాఖలు..

మీరేం చేస్తున్నట్టు?.. త్రిపుర సర్కార్‌ను నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రోజురోజుకూ త్రిపురలో హింస పెరుగుతోందంటూ టీఎంసీ దాఖలు చేసిన కంటెప్ట్ పిటిషన్‌పై ఆ రాష్ట్ర సర్కార్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. మంగళవారంనాడు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌ను ఆదేశించింది.


''మీరు మీ ఇంటికే పరిమితమయ్యారని తెలుసుకున్నాం. మేము చేయగలిగేది ఏముందంటే మీకు ఒక గంటన్నర సమయం ఇవ్వడం. ఇవాళ, రేపు పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, పోలింగ్ రోజు నుంచి ఫలితాలు వెల్లడించేంత వరకూ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలపై పోలీసులు, హోం సెక్రటరీ నుంచి స్పష్టత తీసుకోండి. స్పష్టమైన సమాచారం తీసుకుని ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి మాకు తెలియజేయండి''అని కోర్టు ఆదేశించింది.


విచారణ సందర్భంగా టీఎంసీ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, త్రిపురలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసున్నాయని అన్నారు. ''మేము సమర్పించిన స్క్రీన్‌షాట్లలో హింస జరగినప్పుడు పోలీసులు అచేతనంగా నిలబడి ఉండటం చాలా స్పష్టంగా మీరు చూడవచ్చు'' అని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై త్రిపుర ప్రభుత్వ న్యాయవాది మహేష్ జెఠ్మలానీని జస్టిస్ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నిస్తూ, ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు మీరు (ప్రభుత్వం) తీసుకుంటున్న చర్యలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. కౌంటింగ్ ఎప్పడు? ఇవాళ, కౌంటింగ్ రోజు ఎలాంటి అనుచిత ఘటనలు చోటుచేసుకోకుండా మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అని అడిగింది.

Updated Date - 2021-11-23T19:20:49+05:30 IST