గురువులతో ఇదేం పని?

ABN , First Publish Date - 2021-10-28T13:46:04+05:30 IST

బడుల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు..

గురువులతో ఇదేం పని?

మరుగుదొడ్ల నిర్వహణపై ఉపాధ్యాయుల వినూత్న నిరసనలు 

సామాజిక మాధ్యమాల్లో బాత్రూమ్‌లు కడుగుతున్న ఫొటోలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): బడుల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు బోధనేతర బాధ్యతలతో సతమతమవుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు స్కావెంజర్లను నియమిస్తున్నామని, అమ్మఒడి కోసం తల్లులకు ఇస్తున్న రూ.15వేలలో రూ.వెయ్యి కట్‌ చేసి.. ఆ మొత్తాన్ని స్కావెంజర్లకు ఇవ్వాలని సీఎం జగన్‌ గతంలో ప్రకటించారు. అయితే ఈ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరుగుదొడ్లను శుభ్రం చేసే బాధ్యత ఎవరు చేపట్టాలో అర్థంకాక టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాలు వారికి తీవ్ర అసహనం కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు-నేడు నిర్వహణకు సంబంధించి నిర్మాణ పనులు రుద్ది ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహంతో ఉన్నారు.


మధ్యాహ్న భోజన పథకం, టీచర్ల యాప్‌ నిర్వహణ ఇలా బోధనేతర పనులతో చదువు చెప్పనీయకుండా ఈ గోలేంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసుకుంటున్నారు. ఇటీవల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి ఫొటోలు ఎలా తీయాలి, ఎలా అప్‌లోడ్‌ చేయాలో పేర్కొంటూ మార్గదర్శకాలను పంపించారు. దీంతో విసిగిపోయిన ఒక టీచర్‌ ఏకంగా మరుగుదొడ్లు కడుగుతూ ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గురువులకు ఈ ప్రభుత్వం దొడ్లు కడిగే బాధ్యత అప్పగించిందని నిరసన తెలిపేందుకే ఇలా చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-10-28T13:46:04+05:30 IST