-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » what an understanding-NGTS-AndhraPradesh
-
ఏమి అండర్ స్టాండింగ్!
ABN , First Publish Date - 2022-05-14T06:05:59+05:30 IST
ఒకే రకమైన పనికి సంబంధించి ఒక వార్డులో ఒకలా, మరో వార్డులో మరోలా...మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
విస్తుగొలిపేలా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాలు
ఒకే రకమైన పనికి సంబంధించి ఒక్కో వార్డులో ఒక్కోలా...
విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): ఒకే రకమైన పనికి సంబంధించి ఒక వార్డులో ఒకలా, మరో వార్డులో మరోలా...మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ప్రధాన ఎజెండాగా 22 అంశాలను, టేబుల్ ఎజెండాగా మరో రెండు అంశాలను పెట్టి సభ్యులు చర్చించారు. ప్రధాన ఎజెండాలో మొదటి అంశంగా పొందుపరిచిన కొవిడ్ సమయంలో 12 నెలలపాటు జీవీఎంసీ కమిషనర్ నుంచి జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి, సహాయ వైద్యాధికారులు, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్కు సంబంధించి రూ.12.97 లక్షల బిల్లు చెల్లింపు అంశాన్ని వాయిదా వేశారు. అలాగే 22వ అంశంగా పొందుపరిచిన అనకాపల్లి జోన్లోని ఇద్దరు ఎన్ఎంఆర్ ఉద్యోగులకు రెండేళ్ల వేతనం చెల్లింపును తిరస్కరించారు. అనంతరం టేబుల్ ఎజెండాగా చేర్చిన 35వ వార్డులో సామాజిక భవనం నిర్మాణం, 39వ వార్డులో పాత సామాజిక భవనాన్ని కూల్చేసి కొత్త భవనం నిర్మాణం కోసం గురించి చర్చించారు. అయితే అన్ని వార్డులు సమానంగా అభివృద్ధి చెందాలంటే ఏడాదిలో ఒక్కో వార్డుకు రూ.1.5 కోట్లు మాత్రమే కేటాయించాలని సీలింగ్ విధించుకున్నారు. ఆ ప్రకారం 35వ వార్డుకు సంబంధించి ఇప్పటికే రూ.1.5 కోట్ల విలువైన పనులు ఆమోదం పొందినందున, ఆ అంశాన్ని స్టాండింగ్ కమిటీలో ఆమోదించే అధికారం లేదని...కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ సభ్యులు వాయిదా వేశారు. దీనిప్రకారం 39వ వార్డులో కూడా ఇప్పటికే రూ.1.5 కోట్లు విలువైన పనులకు ఆమోదం లభించింది. కాబట్టి అక్కడ కొత్త సామాజిక భవన నిర్మాణం అంశాన్ని కూడా వాయిదా వేయాలి. గత స్టాండింగ్ కమిటీ సమావేశం ఎజెండాలో ఇదే అంశాన్ని పెడితే రూ.1.5 కోట్లు పరిమితి దాటిపోయిందంటూ వాయిదా వేశారు. కానీ తాజా సమావేశంలో ఏం జరిగిందో తెలియదుగానీ, 39వ వార్డులో పాత సామాజిక భవనం కూల్చేసి ఆస్థలంలో కొత్త భవనం నిర్మించాలనే ప్రతిపాదనను తిరిగి టేబుల్ ఎజెండాగా చర్చకు తేవడంతో పాటు కమిటీ ఆమోదం తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సమావేశంలో 35వ వార్డులో ఈ ఏడాది కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం లేదని చెప్పిన కమిటీ సభ్యులు, 39వ వార్డులో ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కొత్త భవనం నిర్మాణానికి ఎందుకు ఆమోదం తెలపాల్సి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు లేఖ ఇచ్చారని...ఈ నేపథ్యంలో సదరు కార్పొరేటర్ ఒత్తిడి చేయడం వల్లే కమిటీ ఆమోదం తెలిపిందనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా స్టాండింగ్ కమిటీ నిర్ణయాలు ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారుతున్నాయని అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం వ్యాఖ్యానిస్తుండడం విశేషం.