సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు
ABN , First Publish Date - 2020-11-25T08:15:25+05:30 IST
పోలీసు అధికారులు, సిబ్బంది సివిల్ తగాదాల్లో తలదూర్చితే చర్యలు తప్పవని వరంగల్ పోలీసు కమిషనరేట్ ఇన్చార్జి కమిషనర్ ప్రమోద్కుమార్ హెచ్చరించారు.
వరంగల్ ఇన్చార్జి సీపీ ప్రమోద్కుమార్
వరంగల్ అర్బన్ క్రైం, నవంబరు 24: పోలీసు అధికారులు, సిబ్బంది సివిల్ తగాదాల్లో తలదూర్చితే చర్యలు తప్పవని వరంగల్ పోలీసు కమిషనరేట్ ఇన్చార్జి కమిషనర్ ప్రమోద్కుమార్ హెచ్చరించారు. భీమారంలోని శ్రీశుభం కల్యాణ మండపంలో మంగళవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు హాజరు కాగా, వివిధ పోలీ్సస్టేషన్లలో కేసుల నమోదు, వాటి పరిష్కారం, నేరస్థుల వివరాలపై అధికారులను ఇన్చార్జి సీపీ అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఫిర్యాదుదారుడికి ఎఫ్ఐఆర్ కాపీని తప్పకుండా ఇవ్వాలన్నారు. కేసు స్థితిగతులను ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు నమోదు చేయాలని, భూ కబ్జాదారులపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి, గుట్కా, వ్యభిచారం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కమిషనరేట్ పరిధిలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది బదిలీలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయన్నారు. వర్టికల్స్ విధానంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీసీపీలు శ్రీనివా్సరెడ్డి, పుష్ప, వెంకటలక్ష్మి, అదనపు డీసీపీలు భీంరావు, గిరిరాజు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.