సీఎండీ కార్యాలయం వద్ద మీటర్ రీడర్స్ ధర్నా
ABN , First Publish Date - 2022-07-02T06:38:37+05:30 IST
తమ సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ ఏపీఈపీడీసీఎల్ మీటర్ రీడర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం విశాఖ లోని సీఎండీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
విశాఖపట్నం, జూలై 1: తమ సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ ఏపీఈపీడీసీఎల్ మీటర్ రీడర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం విశాఖ లోని సీఎండీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈపీడీసీఎల్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. పీసు రేటు విధానాన్ని రద్దు చేసి నెలవారీ జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎండీ సంతోష్రావుకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన మీటర్ రీడర్స్ పనిదినాలు కుదించబోమని, అయితే ప్రతి నెల 15 లోపు రీడింగ్ పూర్తి చేయాలని చెప్పినట్టు యూనియన్ నాయకులు వివరించారు. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, ప్రతినిధులు ఎల్.రామకృష్ణ, కెఎస్డీఎస్కే రెడ్డి, వి.శ్రీనివాసరావు, ఒ.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాసరావు, పి.నాగబాబు పాల్గొన్నారు.
ఈపీడీసీఎల్లో భారీగా బదిలీలు
ఏపీ ఈపీడీసీఎల్లో భారీగా బదిలీలు జరిగాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసే చీఫ్ జనరల్ మేనేజర్ వరకు అత్యధికులకు స్థానచలనం కలిగించారు. వీటిలో రాజకీయ సిఫారసులే అధికం. ఉద్యోగుల విన్నపాలు, నిబంధనల ప్రకారం చేసినవి చాలా స్వల్పం. గురువారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేశారు. ఐదు జిల్లాల పరిధిలో మొత్తం 284 మందిని బదిలీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో తొమ్మిది మంది సీజీఎంలు, ఏడుగురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, 27 మంది ఈఈలు, 88 మంది డీఈలు, 153 మంది ఏఈలను బదిలీ చేశారు.