దిగిరాని కూరగాయల ధరలు
ABN , First Publish Date - 2021-12-06T04:39:20+05:30 IST
కూరగాయల ధరలు మండుతూనే ఉన్నా యి. గత నెల రోజుల నుంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయా యి.
సామాన్య, మధ్యతరగతి వర్గం బెంబేలు..
ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమంటూ మండిపాటు
ఏలూరు టూటౌన్, డిసెంబరు 5: కూరగాయల ధరలు మండుతూనే ఉన్నా యి. గత నెల రోజుల నుంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయా యి. నెల క్రితం ఏ కూరగాయలను తీసుకున్నా కేజీ రూ.20 నుంచి రూ.30 వరకే ఉండేవి. అలాంటిది ఒకేసారిగా కార్తీకమాసంలో రూ.50 నుంచి రూ.100 వరకు ఎగబాకాయి. ప్రస్తుతం కార్తీక మాసం పూర్తికావడంతో ధరలు అందు బాటులోకి వస్తాయని ఆశించగా ధరలు ఏ మాత్రం తగ్గక పోవడంతో దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజూ కూరల్లో వాడే వంకాయలు, టమోటాలు కేజీ 100 రూపాయలకు ఎగబాకాయి. ఉల్లిపాయలు రూ.50 పైగానే ఉన్నాయి. ఎన్నడూ లేనట్టుగా దొండకాయ ధర రైతుబజారులో రూ.64 కేజీ ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.80 వరకు ఉంది. అదేబాటలో గోరుచిక్కుడు, క్యారెట్, బీరకాయలు, బెండ కాయలు ఉన్నాయి. దోస కాయలు రైతుబజారులో రూ.40 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.60 వరకు అమ్ముతున్నారు. ఆనప రూ.40, పొట్లకాయ రూ.30లకు అమ్ముతున్నా రు. చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్ రూ.120లకు ఎగబాకడంతో చికెన్ ధరే తక్కువ అన్న స్థితికి కూరగాయల ధరలు చేరాయి. భారీ వర్షాలు, వరదలు వల్ల పంటలు తినడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో 15 రోజుల్లో కొత్త పంటలు వచ్చే అవకాశం ఉందని అప్పటి వరకు ధరాఘాతం తప్పదని పేర్కొంటున్నారు.