శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-03-05T05:29:35+05:30 IST
మహాశివరాత్రికి జిల్లాలోని శివాలయాలలో ఉత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ (ఉభయ గోదావరి జిల్లాలు) విజయరాజు చెప్పారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు
నేడు పట్టిసీమలో అధికారులతో సమీక్ష
దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు
భీమవరం, మార్చి 4: మహాశివరాత్రికి జిల్లాలోని శివాలయాలలో ఉత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ (ఉభయ గోదావరి జిల్లాలు) విజయరాజు చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మరోవైపు కరోనా రెండోదశ వ్యాప్తిలో ఉన్నందున అందుకనుగుణంగా పారిశుధ్య కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. గురువారం ఆయన శివరాత్రి ఏర్పాట్లుపై ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు, పెద్ద, చిన్న మొత్తం 295 శివాలయాలు ఉన్నాయని ఇందులో భీమవరం, పాలకొల్లు, పంచారామ క్షేత్రాలతో పాటు పట్టిసీమ వీరేశ్వరస్వామి, ఆచంటలో ఆచంటేశ్వరస్వామి, నత్తా రామేశ్వరం తదితర ప్రధాన ఆల యాలు ఉన్నాయన్నారు. పట్టిసీమ వీరేశ్వరస్వామి ఉత్సవాలకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉందన్నారు. గోదావరి మధ్యలో ఉన్నందున భక్తుల కోసం ఐదు పంట్లు ఏర్పాటు చేయవలసి ఉంద న్నారు.శుక్రవారం పట్టిసీమలో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి భక్తుడు మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాల వద్ద భక్తులకు మంచినీరు, మరుగుదొడ్డు వసతి, దర్శనానికి ఇబ్బంది కలగకుండా చేస్తామన్నారు. భీమవరం, పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో 50 వేల నుంచి 70 వేల మంది వరకు భక్తులు తాకిడి ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.