సార్వాకు రైతులు సన్నద్ధం
ABN , First Publish Date - 2021-06-13T05:27:16+05:30 IST
ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి. వరుణుడు కరుణించాడు.
పలకరించిన తొలకరి వర్షాలు.. పొలం పనుల్లో రైతన్నలు బిజీ
ఏలూరు రూరల్, జూన్ 12 : ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి. వరుణుడు కరుణించాడు. అదును దొరకడంతో వరి ఆకుమడులు సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. దుక్కి చేస్తున్నారు. వర్షాలతో ఇప్పటికే పొలా లకు తడి అందింది. చెరువు, వాగుల్లో నీరు చేరింది. అటు వ్యవసాయ శాఖ అధికారుల్లోనూ సన్నద్ధత కనిపిస్తోంది. రైతు అవసరాలకు సరిపడా విత్తనాల కోసం ఇండెంటు పెట్టారు. సబ్సిడీపై అందించేందుకు సాగు యంత్రాలను సిద్ధం చేశారు. ఏలూరు రూరల్ మండలం 16 వేల హెక్టార్లలో వరి సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయాధికారులు విత్తనాలు, ఎరువులను త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది కంటే ముందే నైరుతి ప్రవేశించి వర్షాలు ప్రారంభమ య్యాయి. దుక్కులు ఖర్చు తడిచి మోపెడు అవుతోందని రైతులు వాపోతున్నా రు. గతంలో సాగు కాడెద్దులతో సంప్రదాయంగా జరిగేవి. యాంత్రీకరణ నేపథ్యంలో గ్రామాల్లో కొద్దిమంది వద్దే ఎద్దులు ఉన్నాయి. దాదాపు మండలం అంతా రైతులు ట్రాక్టర్ల పైనే ఆధారపడుతున్నారు. ఈనేపథ్యంలో డీజిల్ లీటరుకు రూ.95 చేరడంతో ట్రాక్టర్ యజమానులు దుక్కి ధరలను పెంచేశారు. దుక్కులు దున్నడానికి రూ.మూడు వేలు దాదాపు ఖర్చు అవుతుంది.