కందిపప్పు.. తిప్పలు!

ABN , First Publish Date - 2022-09-20T05:40:11+05:30 IST

రేషన్‌ సరుకులు కేటాయింపులు సవ్యంగా సాగడం లేదు.

కందిపప్పు.. తిప్పలు!

ఇస్తామంటున్న  ప్రభుత్వం.. ఆందోళనలో రేషన్‌ డీలర్లు
వినియోగదారుల నుంచి స్పందన కరువు
అక్టోబరు నెలకు డీడీలు తీయాలంటూ ఆదేశాలు
డీలర్ల గుండెల్లో గుబులు
నాణ్యత లేని సరుకు కేటాయింపు


రేషన్‌ సరుకులు కేటాయింపులు సవ్యంగా సాగడం లేదు. బియ్యం మాత్ర మే ప్రతి నెలా యథావిధిగా పంపిణీ చేస్తున్నారు. పంచదార, కందిపప్పు పంపిణీ అస్త వ్యస్తంగా మారింది. గడచిన కొన్ని నెలలుగా కందిపప్పు ఇవ్వడం లేదు. అక్కడక్కడా ఇచ్చినా నాణ్యత లేకుండా ఉంటోంది. పంచ దార పంపిణీ కొందరికే పరిమితం చేస్తున్నారు. జిల్లాలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ల వద్ద అందుబాటులో ఉంటే ఇస్తున్నారు. లేదంటే చేతులెత్తేసే పరిస్థితి. ఈ క్రమంలో వచ్చేనెలకు కందిపప్పుకు డీడీలు తీయాలంటూ ఆదేశించడంతో డీలర్లలో ఆందోళన మొదలైంది. నాణ్యత లేని కందిపప్పు తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపకుంటే తాము నిండా మునిగిపోతామని వాపోతున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ స్థాయిలోనే రేషన్‌ పంపిణీ విధివిధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం పండుగ రోజులు వస్తున్నాయన్న ఉద్దేశంతో అందరికీ పంచదార, కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరులో ఇచ్చేందుకు డీడీలు తీయాలంటూ రేషన్‌ డీలర్లకు దిశానిర్దేశం చేసింది. వచ్చేనెలకు సంబంధించి ఈ నెల 20తేదీ తర్వాత డీడీలు సమర్పించాలి. ఇదే ఇప్పుడు డీలర్లలో గుబులు రేకెత్తిస్తోంది. బియ్యానికి కొద్దిపాటి సొమ్ములు చెల్లిస్తే సరిపోతుంది. కాని పంచదార, కందిపప్పులకు పెద్ద మొత్తంలో చెల్లించాలి. పైగా కార్డుదారుల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉంటోంది. నాణ్యత లేకపోవడంతో కందిపప్పు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దానివల్ల నష్టపోతున్నామంటూ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. పంచదారకు డిమాండ్‌ ఉంటోంది.
 నాణ్యత లేమి
ప్రభుత్వం అందించే కందిపప్పు నాణ్యత ఉండ డం లేదు. ప్రతి రేషన్‌ కార్డుకు కిలో వంతున పప్పు కేటాయిస్తున్నారు. లబ్ధిదారులు కిలో రూ.67 చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో రూ.100లు పైనే ఉన్నప్పటికీ రేషన్‌ పప్పుపై ఆసక్తి చూపడం లేదు. ఈనెలలో ఇచ్చిన కందిపప్పు పుచ్చులు పట్టి ఉంది. పైగా ఈ కందిపప్పు ఉడకడం లేదు. దాంతో డీలర్ల వద్దే ఉండిపోతోంది. జిల్లాలో ప్రతి ఒక్కరికి రేషన్‌లో కందిపప్పు తప్పని సరిచేస్తే  533 టన్నులు అవసరం కానుంది. పంచదార అయితే 262  టన్నులు కేటాయించాలి. పంచదారను లబ్ధిదారులకు అరకిలో వంతున రూ.17లకు ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అరకిలో రూ.20 ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమైతే పప్పు కోసం డీలర్లు కిలోకు రూ.66 వంతున దాదాపు రూ 3.50 కోట్లు చెల్లించాలి. వినియోగదారులు తీసుకోకుంటే ఆ మొత్తాన్ని డీలర్లే భరించాలి. అదే ఇప్పుడు జిల్లాలో రేషన్‌ డీలర్లను ఆందోళనకు గురిచేస్తోంది. డీలర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొద్దిపాటి మొత్తానికైనా డీడీలు సమ ర్పించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే డీలర్ల వద్ద గతంలో ప్రభుత్వం కేటాయించిన కందిపప్పు నిల్వ ఉంది. మళ్లీ ఇప్పుడు ఇదేమి తిప్పలంటూ డీలర్లు ఆవేదన చెందుతున్నారు. నాణ్యత లోపం వల్లే కంది పప్పును తీసుకోవడం లేదు. నాణ్యత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. 

Updated Date - 2022-09-20T05:40:11+05:30 IST