అష్టకష్టాలు

ABN , First Publish Date - 2022-08-15T05:51:42+05:30 IST

విభజన తర్వాత తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి.

అష్టకష్టాలు

ప్రభుత్వ శాఖలను వేధిస్తున్న నిధుల కొరత
తొలి పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై ప్రభావం
వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ఆపసోపాలు
శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కలెక్టర్‌
జిల్లా అభివృద్ధిపై 10 శకటాలే..


భీమవరం, ఆగస్టు 14 : విభజన తర్వాత తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రికి దాదాపు పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాతో పోలిస్తే ఈ వేడుకలు నిర్వహణకు యంత్రాంగం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ శాఖలకు నిధుల కొరత ఈ ఉత్సవాలపై ప్రభావం చూపిస్తోంది. తొలుత ఉత్సవాల నిర్వహణకు విష్ణు క్యాంపస్‌, డీఎన్నార్‌ వంటి ప్రాంతాలను పరిశీలించారు. అయితే తొలిసారి నిర్వహించే వేడుకలను ప్రైవేటు విద్యా సంస్థల్లో నిర్వహించడం సరి కాదన్న భావనతో కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఖాళీ పచ్చగడ్డి మైదానంలో వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకా లం కావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. మూడు వేదికలకు, స్టాల్సును ప్రదర్శన విభాగాలకు మా త్రమే షెల్టర్‌ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో అన్ని ప్రభుత్వ శాఖలు నాలుగు రోజులుగా ఏర్పా ట్లలో తలమునకలై ఉన్నారు. ఉత్సవాల విజయవంతానికి కలెక్టర్‌ ప్రశాంతి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పర్య వేక్షిస్తున్నారు.

పరేడ్‌ నిర్వహణ పట్ల పెదవి విరుపు
కొత్త జిల్లాలో తొలిసారి స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం చేస్తున్న పోలీస్‌ పరేడ్‌ ప్రదర్శన కీలకమైన ఆకర్షణీయంగా ఉండాలి. అయితే ఆదివారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ను పరిశీలించిన కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాశ్‌ పెదవి విరిచినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్‌ వ్యవస్థ ఏర్పడి ఐదు నెలలు అవుతున్నా ఎస్పీ ఆధీనంలో ఉండే స్పెషల్‌ పోలీస్‌ విభాగానికి అవసరమైన వసతులు కొరత ఉంది. వీరు పరేడ్‌ శిక్షణ పొందడానికి గ్రౌండ్‌ సౌకర్యం లేదు. ఆ శిక్షణ లోపమే ట్రయల్‌ రన్‌లో కనిపిందన్న వ్యాఖ్యలు విన్పించాయి.
10 శాఖల శకటాలు మాత్రమే..
జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధిని ప్రదర్శించే కార్యక్రమంలో భాగంగా సచివాలయ వ్యవస్థ, వైద్యశాఖ, పంచా యతీ రాజ్‌శాఖ, విద్యాశాఖ, వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, అగ్నిమాపకశాఖ, జలవనరులశాఖ, డ్వామా, గృహ నిర్మాణశాఖ వంటి పది శాఖల శకటాలను మాత్రమే ఈ సందర్భంగా ప్రదర్శించబోతున్నారు. వీటి తయారు నిర్వహణ కోసం నిధుల కొరత ఉందంటున్నారు. ఏ శాఖకు ఆ శాఖకే వీటి బాధ్యతలు అప్పగించడం వల్ల కీలకమైన శాఖలకే శకటాలు ప్రదర్శనకు ఇచ్చారు.
అంతా వాన దేవుడిపై భారం
వర్షాలు కురవడంతో వేడుకలు జరిగే మైదాన ప్రాంతం  చిత్తడిగా ఉంది. కొంత మట్టితో, నల్ల గ్రావెల్‌తోనూ తాత్కాలిక దారులు ఏర్పాటు చేశారు. వర్షం పడితే కార్యక్రమ నిర్వహణకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.  

ఈ బురదరోడ్డులోనే మంత్రిగారి రాక..
పంద్రాగస్టు వేడుకలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆర్‌అండ్‌బి మంత్రి దాడిశెట్టి రాజా హాజరుకానున్నారు. 165 జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్‌ వరకు 2.2 కిలోమీటర్లు పొడవైన రహదారి మీదుగా ఆయన రావా ల్సి ఉంది. ఇందులో 1.5 కిలోమీటర్లు పైగా అధ్వానంగా, బురదగా ఉండే రహదారిపై చేరుకోవాల్సి ఉంటుంది.  

 పరేడ్‌ ట్రయల్‌ రన్‌
భీమవరం, ఆగస్టు 14 : జిల్లాలో తొలిసారి జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకల ట్రయల్‌ రన్‌ను ఆదివారం ఆమె పరిశీలించి సూచనలు చేశారు. ఎస్పీ రవిప్రకాష్‌ పర్యవేక్షణలో జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్‌ గౌరవ వందనం, పోలీస్‌, వివిధ స్కూల్‌ విద్యార్థుల బ్యాండ్‌ ప్రదర్శన, వివిధ శఖలు శకటాలను పరిశీలించారు. జిల్లాలలోని స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయులను గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, వారి కుటుంబ సభ్యులను సత్కరించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-15T05:51:42+05:30 IST