ఈసారైనా..!
ABN , First Publish Date - 2022-06-30T05:48:16+05:30 IST
గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా సురక్షిత నీరు అందించడం ప్రవాసంలా మారింది.
మూడేళ్లుగా సా..గుతున్న గోదావరి జలాల తరలింపు ప్రక్రియ
ఇటీవల రూ.241 కోట్లతో పనులకు టెండర్లు ఖరారు
తణుకు, నిడదవోలు, పాలకొల్లు పరిధిలో సురక్షిత నీరు అందించేలా చర్యలు
తణుకు, జూన్ 29 : గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా సురక్షిత నీరు అందించడం ప్రవాసంలా మారింది. అమృత్ పథకంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో తణుకు, నిడదవోలు, పాలకొల్లు మునిసిపాలిటీల పరిధి లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రభు త్వం భావించింది. అయితే ఎన్నో అవాంతరాలు వస్తూనే ఉ న్నాయి. మూడేళ్ల నుంచి ప్రక్రియ సా..గుతూనే ఉంది. ప్రభు త్వాలు మారినా ప్రజలకు మాత్రం సురక్షిత తాగునీరు అం దించడంలో తాత్సారం జరుగుతూనే ఉంది. ఆయా పట్ట ణాలు నడుమ గోదావరి జలాలు అందుబాటులో ఉన్న కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ఆయా మునిసిపాలి టీల పరిధిలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా ఏ మాత్రం తాగడానికి అనువుగా లేకుండా కలుషితమై ఉన్నా యి. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు తాగునీటిని ఆర్వో ప్లాంట్ల నుంచి తెచ్చుకుం టున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు ముందుకు సాగేలా అడుగులు పడ్డాయి.
టెండర్లు ఖరారు
ఎట్టకేలకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు ఖరారు చేసింది. తణుకు, నిడదవోలు, పాలకొల్లు మునిసిపాలి టీలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా విజ్జేశ్వరం బ్యారేజ్ వద్ద నిర్మించే బ్యాలెన్సు రిజర్వాయర్ నుంచి ప్రధాన కాల్వల వెంబడి పైపులైనుల ద్వారా నీటిని తరలించేందుకు రూ.241 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు ఖరారు చేసింది. ఈ పనులకు సంబంధించి బ్యాంకర్లతో అగ్రిమెంట్లు ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.
ఐదు లక్షల లీటర్ల రిజర్వాయర్
విజ్జేశ్వరం బ్యారేజీ వద్ద ఐదు లక్షల లీటర్లు కెపాసిటీ గల బ్యాలెన్స్ రిజర్వా యర్ను నిర్మించనున్నారు. అక్కడ నుంచి పైపులైన్లు ద్వారా ఆయా మునిసిపాలిటీల పరిధిలోని రిజ ర్వాయర్లకు చేరుతుంది. అక్కడ ట్రీట్మెంటు చేసిన తర్వాత ప్రజలకు అందిస్తారు.
52 కి.మీ మేర పైపులైన్లు
విజ్జేశ్వరం నుంచి పాలకొల్లు వరకు 52 కిలోమీటర్ల మేర కాల్వను అనుసరించి పైపులైన్లు నిర్మాణం చేయనున్నారు. ఆయా పనులను రెండు ఫేజ్ల్లో చేపట్టనున్నారు. మొదటి ఫేజ్లో ఆయా మునిసిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిం చే వాటర్ ట్యాంకుల నిర్మాణాలు చేపడతారు. రెండో ఫేజ్ లో 65 కిలోమీటర్ల మేర పైపులైన్లు పనులు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన పైపుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్టు పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ చెప్పారు.
జూలైలో పనులు ప్రారంభం
ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తికావడంతో జూలైలో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ ఎలాంటి అవరోధాలు లేకుంటే అనుకున్న విధంగా వచ్చే నెలలో పనులు మొదలు కానున్నాయి.