డ్రగ్స్‌ కేసులో మరొకరి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-22T05:42:59+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్‌ వినియోగం కేసులో మరొకరిని అరెస్టు చేసినట్టు భీమవరం సెబ్‌ సీఐ వర్మ శనివారం తెలిపారు.

డ్రగ్స్‌ కేసులో మరొకరి అరెస్టు
నిందితుడిని చూపిస్తున్న భీమవరం సెబ్‌ సీఐ వర్మ


భీమవరం క్రైం, మే 21 :
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్‌ వినియోగం కేసులో మరొకరిని అరెస్టు చేసినట్టు భీమవరం సెబ్‌ సీఐ వర్మ శనివారం తెలిపారు. ఈ ఏడాది జనవరి 22వ తేదీన భీమవరంలో డ్రగ్స్‌ వినియోగం కేసులో సెబ్‌ అధికారులు భీమవరానికి చెందిన వి.రోహిత్‌ అనే యువకుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేశారు. అతని వద్ద 8 బ్లాట్స్‌ (ఎల్‌ఎస్‌డీ) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో ఫిబ్రవరి 6న హైదరా బాద్‌లో ఉండే రోహిత్‌ వరుసకు సోదరుడైన భీమవరానికి చెంది న వి.రాహుల్‌ను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. సెబ్‌ డైరెక్టర్‌ ఎ.రమేష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ ఆదేశాలతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారు. విజయవాడ ఎస్‌టీఎఫ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వివేక్‌ సహకారంతో ఆధునిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి ఈ కేసులో ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌లో మారం పవన్‌ కుమార్‌ (పవన్‌ కల్యాణ్‌) అనే మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. పవన్‌ కుమార్‌ నుంచి రాహుల్‌ డ్రగ్స్‌ తీసుకుని వాటిని జనవరి 21న భీమవరంలో ఉండే రోహిత్‌కు కొరియర్‌ ద్వారా పంపించినట్టు తెలిపారు. పవన్‌ కుమార్‌ను శనివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్టు తెలిపారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని సీఐ తెలిపారు.

Updated Date - 2022-05-22T05:42:59+05:30 IST