కార్పొరేటర్ల విశ్వరూపం
ABN , First Publish Date - 2022-07-02T06:32:54+05:30 IST
నాడు ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగిన కార్పొ రేటర్లు నేడు వారినే వేధిస్తూ.. ఓట్లు అడిగిన చేతు లతోనే దాడులు చేస్తున్నారు.
ఏలూరులో అధికారపు ఆగడాలు.. ప్రజలపై దౌర్జన్యాలు
భూ కబ్జాలకు తెగబడ్డ ఇద్దరిపై ఇప్పటికే కేసు నమోదు
సెటిల్మెంట్లు, వడ్డీ వ్యాపారస్తులతో పబ్బం గడుపుకుంటున్న పలువురు
తాజాగా నమస్కారం పెట్టలేదని సామాన్యుడిపై దాడి
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
సీన్ నెంబరు – 1
ఏలూరు చాటపర్రు రోడ్డులో రాఘవేంద్ర అపార్ట్మెంట్స్ వెనుక వున్న 33 అడుగుల రోడ్డును కబ్జా చేయడానికి ఇద్దరు కార్పొరేటర్లు తెగపడ్డారు. స్థానికులను భయపెట్టి, బెదిరించి చివరకు శంకుస్థాపన వరకు వెళ్లారు. స్థానికులు తిరగబడడంతో నిర్మాణం సగంలోనే నిలిచిపోయింది. అయినా ఆగని 5, 6 డివిజన్ల కార్పొరేటర్లు మరోసారి కబ్జాకు ప్రయత్నించడంతో స్థానికులు ఇద్దరిపైనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సీన్ నెంబరు – 2
కుటుంబీకుల మధ్య తలెత్తే సమస్యలపై ప్రైవేట్ సెటిల్మెంట్ చేపట్టిన ఓ డివిజన్ కార్పొరేటర్, ఆమె భర్త ఒక వృద్ధురాలిపై చేయి చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చే సమయంలో మాట వినని కారణంగా ఆ అవ్వపై కార్పొరేటర్ కుటుంబం చేయి చేసుకుంది. ఈ ఘటనతో అప్పటి వరకు రహస్యంగా సాగుతున్న వారి సెటిల్మెంట్ల దందా వెలుగులోకి వచ్చింది.
సీన్ నెంబరు – 3
ఎమ్ఓయూ వాహన డ్రైవర్గా పనిచేస్తోన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి నమస్కారం పెట్టలేదన్న కారణంగా గురువారం రాత్రి స్థానిక మహిళా కార్పొరేటర్, ఆమె భర్త తదితరులు ఆ యువకుడిపై దాడి చేశారు. గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆ యువకుడు తనపై కార్పొరేటర్ తదితరులు దాడి చేశారని, తనకు న్యాయం కావాలని ఆసుపత్రి సాక్షిగా డిమాండ్ చేస్తున్నాడు.
నాడు ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగిన కార్పొ రేటర్లు నేడు వారినే వేధిస్తూ.. ఓట్లు అడిగిన చేతు లతోనే దాడులు చేస్తున్నారు. వారానికో పంచాయి తీ, నెలకో వివాదంతో పలువురు నగర పరిధిలో హల్చల్ చేస్తున్నారు. ‘చెప్పిందే చేయాలి. ఏం చేసి నా అడ్డు చెప్పకూడదు. ఎదురు ప్రశ్నించకూడదు’ అంటూ సొంత అజెండాతో విశ్వరూపం చూపిస్తు న్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మితిమీరు తోన్న కొందరు కార్పొరేటర్ల వేధింపులు పోలీస్ స్టేష న్ వరకూ వెళ్తున్నా పద్ధతి మారడం లేదు. పార్టీ పరిస్థితి స్థానికంగా అధ్వానంగా మారిన తరుణం లో సాక్షాత్తు ఎమ్మెల్యేనే ‘గడప గడపకు’ వాయిదా వేసుకుని తిరుగుతూంటే, పార్టీ పటిష్టతతో సంబం ధం లేని కార్పొరేటర్లు తమ పంథా మార్చుకునేదే లేదంటున్నారు. ఈ క్రమంలో త్వరలో ప్లీనరీ ము గించుకుని ’గడప గడపకు’ వెళ్లాలని ప్రయత్నిస్తు న్న నాయకులకు చేదు అనుభవాలు మిగిల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నమస్కారం పెట్టలేదని..
ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను పంపిణీ చేసే క్రమంలో వాటిని తీసుకుని దాచిన శ్రీనివాస రావు అనే ఎంఓయూ వాహన డ్రైవర్ 40వ డివిజన్లోని కొత్తపేటలో గల చేప తూము సెంటర్ వద్ద వేచి ఉన్నాడు. ఆ సమయంలో స్థానిక కార్పొ రేటర్ తుమరాడ స్రవంతి, ఆమె భర్త నాగరాజు అటుగా వెళుతూ డ్రైవర్ను చూశారు. అతను పని లో ఉండి వీరిని గమనించలేదు. తమను చూసి కనీసం నమస్కారం పెట్టలేదని ఆ కార్పొరేటర్, అతని భర్త ఇద్దరూ డ్రైవర్తో వాదనకు దిగారు. కార్పొరేటర్ అనుచరులు శ్రీనివాసరావుపై దాడి చేశారు. దీనిపై న్యాయం కోరుతూ డ్రైవర్ పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. కానీ, వారు ఇంత వరకు కేసు నమోదు చేయలేదు.
పేరుకే కేసు నమోదు
ఇటీవల 5వ డివిజన్ చాటపర్రు రోడ్డులో రాఘవేంద్ర అపార్ట్మెంట్స్ వెనుక ఉన్న 33 అడుగుల రోడ్డుపై కొందరు పెద్దల కన్ను పడింది. గతంలో వెంకటాపురం పంచాయతీ పరిధిలోని ఆ ప్రాంతంలో ఆర్ఎస్ నెంబర్ 799, 801లో భూమిని ప్లాట్లుగా విభజించారు. దాని పీఆర్పీ నెం.90లో ఉన్న 800 చ.గజాలతో అపార్ట్మెంట్ నిర్మించారు. మిగిలిన స్థలాన్ని కామన్ ఏరియా గా వదిలారు. అందులో కల్యాణ మండపం నిర్మాణానికి ఓ సంఘం తరపున అక్కడ నెల క్రితం శంకుస్థాపన చేశారు. వాస్తవానికి అది కామన్ ఏరియా స్థలం కాదని, 33 అడుగుల రోడ్డుగా ఉందని చెబుతూ అందుకు తగిన లే–అవుట్ ఆధారాలతో స్థానికంగా రాజేంద్రనాథ్ అనే వ్యక్తి స్పందన ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణకు వెళ్లిన టౌన్ ప్లానిం గ్ అధికారులు ఫిర్యాదుదారుడితో మాట్లాడుతున్న క్రమంలో కార్పొరేటర్లు జయకర్, సుంకర చంద్రశేఖర్ ఫిర్యాదుదారుడిపై దౌర్జన్యానికి దిగారు. తమ పై ఫిర్యాదు చేయడానికి నువ్వెవరని అరుస్తూ దుర్భాషలాడారని, ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఫిర్యాదుదారుడు రాజేంద్ర ఫిర్యాదు చేయగా పోలీ సులు కేసు నమోదు చేశారు. రెండు వారాలు గడుస్తున్నా పురోగతి లేదు.
వడ్డీ రాయుళ్లకు మద్దతు
అధికార పార్టీ అండ ఉండటంతో పలువురు వడ్డీ వ్యాపారులు నగరంలో పేట్రేగిపోతున్నారు. మే 15న పత్తేబాద రైతుబజార్ కేంద్రంగా చేసుకుని పలువురు వడ్డీ వ్యాపారులు అక్కడి చిరు వ్యాపారిపై దాడి చేశారు. ఇచ్చిన అసలుకంటే ఆ చిరు వ్యాపారి నుంచి అధిక వడ్డీని దండుకుంటున్నారు. అంతకుమించి ఇవ్వలేనని ఇవ్వాల్సిన మొత్తంలో రూ.20 వేలను రెండు నెలల్లో ఇచ్చేస్తానని చెప్పినా పట్టించుకోలేదు. అప్పు తీసుకున్న మణికృష్ణ అనే యువకుడు మూడు నెలలుగా వడ్డీ ఇవ్వలేదని నెరుసు వంశీ అనే ఓ వడ్డీ వ్యాపారి అనుచరులతో కలిసి అతన్ని చావకొట్టారు. ఆ దాడిలో తన చేతులు, చేతి మణికట్టు వద్ద రెండుచోట్ల విరిగిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును కేసు వరకు వెళ్లకుండా ఓ కార్పొరేటర్ అడ్డుకున్నా డు. అధికారం అడ్డుపెట్టుకుని పోలీసులకు హుకుం జారీ చేయడంతో పోలీ సులు వెనకాడారు. దీనిపై వచ్చిన వార్త కథనాలతో చివరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రజలపై దాడులకు దిగుతూ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటం అధికార పార్టీ నాయకులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ సమయంలో ప్లీనరీ, గడప గడప కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో నుంచి వచ్చే వ్యతిరేకతపై వారు ఆందోళనకు గురిచేస్తున్నట్టు సమాచారం.