రెమ్డెసివిర్ ఇంజక్షన్ల అపహరణ..
ABN , First Publish Date - 2021-05-17T06:10:17+05:30 IST
కరోనా బాధితులకు ఇవ్వాల్సిన రెమ్డిసివిర్ ఇంజక్షన్లు రోజు రోజుకూ అపహ రణకు గురవుతున్నాయి.
నర్సు సహా ముగ్గురు అరెస్ట్
ఏలూరు క్రైం, మే 16 : కరోనా బాధితులకు ఇవ్వాల్సిన రెమ్డిసివిర్ ఇంజక్షన్లు రోజు రోజుకూ అపహ రణకు గురవుతున్నాయి. ప్రాణాలు పోయాల్సిన వైద్య సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవల ఏలూరులో మూడు ముఠాలకు చెందిన పది మందిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కింది. ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్కిరణ్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్క పల్లికి చెందిన నున్నా సత్యవతి ఏలూరు చైత్ర ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ ఆసుపత్రిలో కరోనా బాధితులకు పెయిడ్ సర్వీసులో వైద్య సేవలందిస్తున్నారు. బాధితులకు చేయాల్సిన రెవెడిసివర్ ఇంజక్షన్లను అపహరిస్తోంది. వీటిని తన స్నేహితుడైన ఏలూరు రూరల్ మండలం చొదిమెళ్ళకు చెందిన తిట్ల నాగ ప్రసన్నకుమార్కు ఇస్తోంది. అతను తన స్నేహితుడు అంకమ రామకృష్ణతో కలిసి మార్కెట్లో ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.30 వేలకు విక్రయిస్తుండగా తాము పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రెమ్డిసివిర్ ఇంజక్షన్లు అపహరించిన ఇద్దరు నర్సులు, ఒక ఉద్యోగిని అరెస్ట్ చేశామని చెప్పారు. వీరితోపాటు మిగిలిన వారిని గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.