ఆక్వాకు విద్యుత్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-08-12T05:42:59+05:30 IST

ఆక్వా హబ్‌గా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతకాలంగా ఆక్వా సాగు తగ్గిపోయింది.

ఆక్వాకు విద్యుత్‌ షాక్‌

విద్యుత్‌ సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వ షరతులతో రైతుల బెంబేలు
జిల్లాలో తగ్గిన రొయ్యల సాగు విస్తీర్ణం
10 వేల ఎకరాలలోపు మాత్రమే సాగు
కొత్తసాగు ప్రారంభానికి రెండు నెలలుగా రైతులు వెనుకంజ  


ఆక్వా హబ్‌గా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతకాలంగా ఆక్వా సాగు తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో 80 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు చేసేవారు. విభజన తర్వాత సుమారు 60 వేల ఎకరాలు సాగులో ఉంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీని చేయడానికి షరతులు విధించడంతో రైతులు ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టరేట్‌ దగ్గర ఆందోళన చేసిన రైతులు ఈనెల 20వ తేదీ నాటికి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆక్వా సాగుపై నీలినీడలు అలముకున్నాయి.

భీమవరం, ఆగస్టు 11 :  ఆక్వా సమస్యలపై మూడు నెలలుగా రైతులు, రైతు సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. సాగుకు ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీని గతం లో మాదిరిగా అందరికీ వర్తింపచేయాలని, జోన్‌ విధానాన్ని రద్దు చేయాలని, రొయ్యల ధరల నియంత్రణ స్థానికంగా అదుపులో ఉంచాలని, మేతల ధరలను తగ్గించాలని, నాణ్యమైన రొయ్యల సీడును సరఫరా చేయాలని డిమాండ్‌  చేస్తున్నారు. ఈ క్రమంలో ఆక్వా సాగు విస్తీర్ణం గణనీయం గా పడిపోయింది. ప్రస్తుతం జిల్లాలో 10–20 శాతం మధ్య విస్తీర్ణంలో సాగు జరగుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇదంతా ఆక్వా రంగంపై విద్యుత్‌ షాక్‌ కారణమని వాపోతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రస్తుతం 10 వేల ఎక రాలలోపు మాత్రమే జిల్లాలో రొయ్యల సాగు ఉంది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు తోడయ్యాయి. దీంతో గత జూన్‌ నెల నుంచి క్రమంగా రైతులు సాగు విస్తీర్ణం తగ్గించేశారు. రాబోయే రోజుల్లో ఆక్వా హబ్‌ పేరు కాస్తా పశ్చిమకు తొలగిపోతుందని చెబుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో దీనిపై ఆధారపడి వివిధ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి తగ్గిపోయింది.  చెరువులకు మేతలు వేసేవారు, చెరువుల వద్ద కాపలా కాసేవారు, రొయ్యల వొలుపు కార్మికులు, వివిధ వ్యాపారాలు వద్ద ఉపాధి పొందే వారందరూ ఇప్పుడు రోడ్డున పడుతున్నారు.


విద్యుత్‌ సబ్సిడీతోనే ఉపశమనం
ఆక్వా  రైతులకు విద్యుత్‌ సబ్సిడీయే ఉపశమనం కలిగిస్తోంది. అలాంటి దానిపై నిబంధనల పేరిట సొమ్ములు వసూలు చేయడం వల్ల 60 శాతం మంది రైతులు ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లను సానుభూతితో పరిష్కరించాలి. లేకపోతే 20వ తేదీ తర్వాత ఉద్యమం కొనసాగిస్తాం.
– గాదిరాజు సుబ్బరాజు (జీకేఎఫ్‌ సుబ్బరాజు), ఆక్వా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి


పని దొరకట్లేదు..
ఎక్కువ మంది మహిళలు ప్రాసెసింగ్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సాగు తగ్గించేయ డం, వాతావరణ మార్పులు, వ్యాధులు ప్రబలడం వల్ల దిగుబడి లేక పని దొరకట్లేదు. కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి.
 – తోట తాయారు,  ప్రాసెసింగ్‌ పని, మోగల్లు

Updated Date - 2022-08-12T05:42:59+05:30 IST