ఐదు వేల మంది తల్లులు అమ్మ ఒడికి దూరం

ABN , First Publish Date - 2021-01-25T05:59:52+05:30 IST

పెంటపాడుకు చెందిన వెంకట ధనలక్ష్మి కుమార్తె హాసనిశ్రీ ప్రైవేటు స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. రేషన్‌ కార్డు లేకపోవడంతో గతేడాది అమ్మ ఒడి రాలేదు.

ఐదు వేల మంది తల్లులు అమ్మ ఒడికి దూరం

విద్యార్థుల  జీరో అటెండెన్సే కారణమంటూ వెల్లడి

 ఈ ఏడాది తెరుచుకోని ప్రాథమిక పాఠశాలలు 

 తరగతులన్నీ ఆన్‌లైన్‌లోనే.. హాజరుతో సంబంధమే లేదు

 బ్యాంకు ఖాతాల్లో తప్పులు... అధికారుల చుట్టూ ప్రదక్షణలు

 పాఠశాలలపై ఒత్తిళ్లు


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

పెంటపాడుకు చెందిన వెంకట ధనలక్ష్మి కుమార్తె హాసనిశ్రీ ప్రైవేటు స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. రేషన్‌ కార్డు లేకపోవడంతో గతేడాది అమ్మ ఒడి రాలేదు. ఈ ఏడాది కార్డు మంజూరువడంతో అమ్మ ఒడికి దరఖాస్తు చేస్తే అర్హుల జాబితాలోకి వెళ్లింది. తీరా సొమ్ములు పడే సరికి అనర్హురాలంటూ తేలింది. కారణం ఆ పాపకు జీరో హాజరని తేల్చారు. వాస్తవానికి ఈ ఏడాది ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల హాజరుతో సంబంధం లేదు. అయినా సరే జీరో అటెండన్స్‌ చూపారు. దీంతో ఆమె టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేశారు. వారు సచివాలయానికి వెళితే సరిచేస్తారని తెలిపారు. సచివాలయానికి వెళితే ఎంఈవో ఆఫీస్‌కు వెళ్లాలని సూచించారు. ఎంఈవో ఆఫీస్‌కు వెళితే హాజరు శాతం సమస్యను పాఠశాలలోనే సరిదిద్దాలన్నారు. పాఠశాలలలో తప్పులు సరిదిద్దేందుకు సైట్‌ ఓపెన్‌ కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అమ్మఒడి కోసం ఇలా ధనలక్ష్మి అధికారులు చుట్టూ తిరిగారు. అయినా సమస్యకు పరిష్కారం లభించలేదు.  

ఇది ఒక్క హాసనీ శ్రీ సమస్య కాదు. జిల్లాలో దాదాపు 5 వేల మందికి అమ్మఒడి పడలేదు. జీరో టెండెన్స్‌, బ్యాంకు ఖాతా నెం బర్‌లలో తప్పులు దొర్లడం వల్ల అమ్మఒడికి నోచుకోలేకపోయారు. దీనిని స్థానిక సచి వాలయాల్లో సరిదిద్దే అవకాశం ఉందని చెపుతున్నారు. తీరా అక్కడకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఎంఈవో కార్యాలయాల్లోనూ తమకు సంబంధం లేదంటూ సమాధానం చెపుతున్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులు తాము చదువుతున్న పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్నారు. తీరా తప్పులు సరిదిద్దేందుకు అవకాశం ఉందని చూస్తే సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇటువంటి అవకా శం ఉందని తెలుస్తోంది. 

కానీ ప్రైవేటు పాఠశాలలకు అవకాశం ఇవ్వలేదు. దాంతో యాజమాన్యాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. వాస్తవానికి హాజరు శాతాన్ని ఈ ఏడాది పాఠశాలల్లో నమోదు చేయలేదు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. విద్యార్థుల హాజరుతో సంబంధం లేదని ప్రభుత్వమే స్పష్టం చేసింది. దాంతో రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పాఠశాలల్లో అమ్మఒడి కోసం నమోదు చేశారు. తీరా పథకం అమల య్యాక జీరో అటెండెన్స్‌ అంటూ కొందరికి అమ్మఒడి పడలేదు. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తా యంటూ ప్రాథమికంగా తేల్చారు.  బ్యాంకు నెంబర్లలో తప్పులు దొర్లితే సచివాలయాల్లో సరిచేస్తారని చెపుతున్నారు. అదికూడా నెరవేరడం లేదు. సచివాలయాలకు వెళితే కనీస స్పందన ఉండడం లేదంటూ తల్లిదం డ్రులు వాపోతున్నారు. గతేడాది అమ్మ ఒడి పథకం అమలు జరిగినప్పుడు జిల్లాలో 3600 మంది తల్లులకు పడలేదు. తర్వాత వెసులుబాటు కల్పించడంతో అందరికీ అమ్మఒడి లభించింది. అన్ని అర్హతలు ఉన్నా ఈ ఏడాది పథకానికి నోచుకోని వారి సంఖ్య మరింత పెరిగింది. ప్రతి పాఠశాల లోనూ 10 నుంచి 15 మంది విద్యార్థులు అమ్మ ఒడికి దూరమయ్యారు. జిల్లాలో దాదాపు 5000 మందికి అమ్మఒడి పడలేదని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. 

చర్యలు తీసుకోవాలి

జిల్లా విద్యాశాఖ అధికారుల వివరణ కోరితే గతేడాది మాదిరిగానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెపుతున్నారు. కానీ సచివాలయాల్లో లేదంటే పాఠశాలల్లో తప్పు సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందా అనే విషయమై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాలి. 


Updated Date - 2021-01-25T05:59:52+05:30 IST